ఈత సరదా..
గంట్యాడ: ఈత సరదా ఓ కుటుంబంలో విషాదం నింపింది. సరదగా డ్యాంలో ఈతకు దిగిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. అంతలోనే శవమై తేలాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. సీతారాంపురం గ్రామానికి చెందిన కొల్లి దశరధరామునాయుడు(30) తన మామయ్యతో కలిసి తాటిపూడి డ్యాం సందర్శనకు శుక్రవారం వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం మామయ్య విశ్రాంతి తీసుకుంటుండగా.. దశరధరామునాయుడు డ్యాం కింద నీటిలో సరదాగా ఈతకు దిగాడు. కొంతసేపటి తరువాత మామయ్య మేల్కొని చూడగా నాయుడు కనిపించలేదు. అక్కడే చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో స్థానికంగా గాలించారు. ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ వెతకగా డ్యాం గేటు కింద గోస్తనీ నదికి వెళ్లే కాలువలో మృతదేహం తేలింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


