విజయనగరం టౌన్: విజయనగరం కళాకారుడు, నటుడు, దర్శకుడు, నటరత్న నాటక పరిషత్ కార్యదర్శి గెద్ద వరప్రసాద్ గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. ఆయన ఇకలేరనే విషయాన్ని తెలుసుకున్న సినీ, సాహిత్య, అభిమానలోకం విస్తుపోయింది. ఆదివారం శివాలయం వీధిలో ఉన్న ఆయన స్వగృహం వద్ద పార్ధివదేహాన్ని ఉంచుతామని, మధ్యాహ్నం 12గంటలలోపు అంత్యక్రియలు పూర్తి చేస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నాటకమే నవనాడుల్లో నింపిన వరప్రసాద్ ఇక లేరంటే ఊహించడం అత్యంత బాధాకరమని డాక్టర్ మీగడ రామలింగస్వామి పేర్కొన్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని సినీనటి పడాల కళ్యాణి సామాజిక మాధ్యమాల ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వారిలో పెద్దింటి అప్పారావు, తరిణి మహేశ్వరరావు, నటి రాజేశ్వరి, హైదారాబాద్ నుంచి డాక్టర్ పివి.రామకుమార్, కళారాధన సాంస్కృతిక సంస్ధ (నంద్యాల) కార్యదర్శి ఎస్ఆర్ఎస్.ప్రసాద్, ఆర్.సూర్యపాత్రో, సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు, ఆరిపాక బ్రహ్మానందం నాటక పరిషత్, జరజాపుపేటకు చెందిన ఆరిపాక శ్రీనివాసరావుతో పాటూ వందలాది మంది కళాకారులు, అభిమానులు ఆయన ఆత్మకు సద్గతులు సంప్రాప్తించాలని, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు.


