పార్వతీపురం రూరల్: మత్తు పదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రైల్వే మార్గాల ద్వారా సాగుతున్న మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపేలా ఈగల్ సెల్ రంగంలోకి దిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం ఈగల్ సెల్, రైల్వే, స్థానిక పోలీసు బలగాలు సంయుక్తంగా రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఐజీపీ (ఈగల్) ఏకే రవికృష్ణ, జిల్లా ఎస్పీ ఎన్.మాధవ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. భవానీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్యాసింజర్ రైలు (నెం. 58503) ఎక్కిన బృందాలు.. పార్వతీపురం నుంచి విజయనగరం వరకు ప్రయాణిస్తూ అణువణువూ జల్లెడ పట్టాయి. ఈగల్ సెల్ ఎస్ఐ, కొమరాడ పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్తో పాటు డాగ్ స్క్వాడ్, డ్రోన్ బృందాలు రైలు బోగీలను, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో ఎక్కడా ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. మత్తు పదార్థాల రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా.. జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థలైన రైళ్లు, బస్సుల్లో ఇకపై నిరంతరంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఈగల్ సెల్ అధికారులు స్పష్టం చేశారు.


