● కలెక్టర్ రాంసుందర్రెడ్డి
● చింతపల్లి బీచ్లో యోగాంధ్ర
పూసపాటిరేగ: మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని కలెక్టర్ రాంసుందర్రెడ్డి అన్నారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన చింతపల్లి బీచ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి, జాయంట్ కలెక్టర్ సేతుమాధవన్ స్వయంగా యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. సముద్రపు గాలి, అలలు హోరు మధ్య చింతపల్లి బీచ్ ప్రాంగణం సుమారు రెండు వేల మంది యోగా సాధకుల యోగాసనాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు పాటు యోగా కోసం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డ్వామా పీడీ శారద, జిల్లా పర్యాటక శాఖ అధికారి పిఎన్వి.లక్ష్మీనారాయణ, యోగాంధ్ర నోడల్ అధికారి వరప్రసాద్, తహసీల్దార్ ఎన్వి.రమణ, ఎంపీడీఓ ఎం.రాధిక, డెప్యూటీ తహసీల్దార్ సంజీవ్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధురితో పాటు ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


