పాలకొండ రూరల్: వంటల్లో కీలకమైన అల్లం, వెల్లుల్లి ధరలు వినియోగదారునికి చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కాయగూరల ధరలకు రెక్కలు వస్తున్నాయి. వారం క్రితం రూ.60 పలికిన కిలో అల్లం, వెల్లుల్లి ధర ప్రస్తుతం రెట్టింపు ధర పలుకుతున్నాయి. అల్లం కిలో రూ.120పైబడి ఉండగా వెల్లుల్లి కిలో రూ.125కి చేరడంతో పాటు బీన్స్ కూడా రూ.వందకు చేరాయి. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో పాటు దిగుబడి, రవాణా లోపంతో డిమాండ్కు తగినట్లు సరుకులు ఉండడం లేదని వర్తకులు చెబుతున్నారు. దీంతో వారం వ్యవధిలో ధర పెరిగినట్లు తెలుస్తోంది.
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీ ప్రాంతంలో ఈ సీజన్లో లభ్యమయ్యే ఫలసాయాల్లో పనస పళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. మంచి రుచితో పాటు పోషక విలువలున్న ఈ పళ్లను తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మండల పరిధిలోని ఏ గ్రామంలో చూసినా పనస చెట్లు కనిసిస్తాయి. ప్రస్తుతం ఏ చెట్టు చూసినా పనస కాయల దిగుబడి బాగా కనిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో పనస కాయలు ముదిరి పళ్ల దశకు చేరుకోనుండగా వాటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.


