వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అరెస్ట్‌

Mar 19 2026 8:26 AM | Updated on Mar 19 2026 8:26 AM

వంగర: మండల పరిధి అరసాడలో గత నెల ఫిబ్రవరి 13న దొంతల దుర్గారావు స్క్రాప్‌ షాపులో జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్సై షేక్‌ శంకర్‌ బుధవారం తెలిపారు. 96 కేజీల ఇత్తడి సామగ్రి, 100 ఫ్యాన్‌ కోన్స్‌, ఒక ఎలక్ట్రిక్‌ కాటా, రూ.4600 నగదు చోరీ జరిగినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామన్నారు. ఈ కేసులో విశాఖపట్నం పరిధి పాతగాజువాకకు చెందిన ఆసనాలు కృష్ణ గుర్తించామన్నారు. అరసాడలో మిగిలిన స్క్రాప్‌ షాపుల్లో దొంగతనం చేసేందుకు ఈ ప్రాంతంలో సంచరించడంతో నిందితుడు పట్టుబడ్డాడని, అరెస్ట్‌ చేసి పాలకొండ జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించామని ఎస్సై తెలిపారు.

మత సామరస్యం

పాటించాలి : ఎస్పీ

విజయనగరం క్రైమ్‌ : ఉగాది, రంజాన్‌ పర్వదినాల సందర్భంగా మత సామరస్యం పాటించాలని ఎస్పీ దామోదర్‌ ఒక ప్రకటనలో కోరారు. ఈ రెండు పండగలు సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. పండగల సందర్భంగా మత సామరస్యం పాటించాలని, శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని కోరారు. సోషల్‌ మీడియా వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో పోలీసుల సూచలను తప్పకుండా పాటించాలని కోరారు. మసీదులు, దేవాలయాల వద్ద పటిష్ట ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.

మోటారుసైకిలు ఢీకొని వ్యక్తి మృతి

సీతానగరం: మండలంలోని విశాఖ– రాయగడ రహదారిపై మరిపివలస వద్ద మంగళవారం మోటారు సైకిలు ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానిక పోలీసులు అందించిన వివరాలు.. మంగళవారం సాయంత్రం మరిపివలస గ్రామానికి చెందిన గెంబలి మోహనరావు (66) తన ఇంటి నుంచి సరుకులు కొనుగోలు నిమిత్తం రోడ్డు దాటుతుండగా పార్వతీపురం నుంచి సీతానగరం వైపు వస్తున్న మోటారుసైకిలు ఢీ కొట్టడంతో గాయాల పాలయ్యాడు. పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్టు తెలిపారు. స్థానికుడు బి.చిట్టిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం హెచ్‌సీ సోమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

23న మెగా జాబ్‌ మేళా

విజయనగరం అర్బన్‌: స్థానిక టీఏటీ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో ఈ నెల 23న మేగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు కాలేజీ డైరెక్టర్‌ కొయిలాడ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఆర్‌ఓ కార్యాలయం సమీపంలోని బొడ్దువారి జంక్షన్‌ వద్ద ఉన్న కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది. హెచ్‌ఎస్‌ఎన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో ఈ జాబ్‌ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేళాలో డిక్సన్‌, ప్రీమియర్‌, రేడియంట్‌, స్కైక్వాడ్‌ ఎలక్ట్రానిక్స్‌, టీసీఎల్‌ వంటి సంస్థలు పొల్గొననున్నాయి. ఎంఎఫ్‌జీ ఆపరేటర్‌, ఎస్‌ఎంఏటీ ఆపరేటర్‌, టెక్సీషియన్‌, ప్రొడక్షన్‌, అసెంబ్లీ ఆపరేటర్‌ వంటి పోస్టులకు నియామకాలు చేపడతారు. 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలని, ఎంపికై న వారికి రూ.13 వేల నుంచి 25 వేల వరకు నెలసరి వేతనంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. వెయ్యికి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉండగా స్పాట్‌ ఆఫర్లు కూడా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9866902665, 9908472726 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

సారా ధ్వంసం

పాలకొండ రూరల్‌: పాలకొండ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 172 లీటర్ల నాటుసారా, 10 లీటర్ల మద్యం సీసాలను బుధవారం ధ్వంసం చేసినట్టు ఆ శాఖ సీఐ కిమిడి సూర్యకుమారి తెలిపారు. సంబంధిత శాఖ కమిషనర్‌, జిల్లా సూపరింటెండెంట్‌ ఎ.సంతోష్‌కుమార్‌ సూచనలతో అక్రమ మద్యం, సారా తరలింపులో పట్టుబడిన మూడు వాహనాలకు బహిరంగ వేలం ద్వారా ఔత్సాహికులకు అందించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement