జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రభాకర రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, వసతులను పరిశీలించి తాగునీరు, వెలుతురు, ఫ్యాన్ల పనితీరుపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ కఠినంగా అమలు చేసి మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత ఉద్యోగులకు సూచించారు.
మామిడి పంటకు ఆశించే తెగుళ్లపై అవగాహన
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సుమారు 21,060 హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉందని, ఇందులో 28,500 హెక్టార్లలో కాపు దశలో ఉన్నాయని జిల్లా ఉద్యాన శాఖాధికారి పి.చిట్టిబాబు బుధవారం తెలిపారు. డిసెంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలు, ప్రస్తుతం పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట పొగ మంచు వంటి ప్రతికూల వాతావరణం వల్ల మొదటి దఫా పూతకు కొంత నష్టం వాటిల్లిందన్నారు. దీని వల్ల తామర పురుగులు, తేనే మంచు పురుగులు, బూడిద తెగులు ఉధృతి పెరిగిందన్నారు.
21 నుంచి గజపతినగరంలో ఇంటర్మీడియట్
మూల్యాంకనం
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయని, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 21 నుంచి గజపతినగరంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ప్రారంభిస్తామని ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు తెలిపారు. జిల్లాకు వచ్చిన రెండు లక్షల 30 వేల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను రెండు విడతలుగా చేపడతామని తెలియజేశారు. జిల్లాకు వచ్చిన వాటిలో ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మాథ్స్, హిస్టరీ, సంస్కృతం సబ్జెక్టు పేపర్లతో పాటు 85 వేల వరకు ఒకేషనల్ జవాబు పత్రాలు ఉన్నట్టు వెల్లడించారు. రెండో విడత మూల్యాంకన ప్రక్రియను ఈ నెల 25 నుంచి చేపడతామని స్పష్టంచేశారు.
బేకరీలపై విజిలెన్స్ దాడులు
రాజాం సిటీ: పట్టణంలోని పలు బేకరీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం చేపట్టిన ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించడంతో తొమ్మిది సిలింబర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేశారు.


