
పురం పరువు గోవిందా!
● గాడి తప్పుతున్న మున్సిపల్ పాలన ● చీలిపోతున్న ఉద్యోగులు ● పెన్డౌన్కు దిగిన సిబ్బంది ● పట్టణ సమస్యలు గాలికి
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం పురపాలక సంఘం పరువు పోతోంది. పుర పాలన గాడి తప్పుతోంది. నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తోంది. పట్టణ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ఉద్యోగులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివాదాలతో రచ్చకెక్కుతున్నారు.
ఏడాదిగా వివాదాలు..
గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పాలన మారింది. ఇదే సమయంలో మున్సిపల్ పాలక వర్గం మాత్రం.. వైఎస్సార్ సీపీదే. మధ్యలో అడ్డదారిలోనైనా మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని కూటమి నాయకులు విఫలయత్నం చేశారు. అది కుదరలేదు. ఈలోగా కొంతమంది కౌన్సిలర్లు కూటమి పక్షాన చేరారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు రాకతో పరిస్థితి మొత్తం మారిపోయింది. అభివృద్ధి కుంటుపడిందన్నది ప్రధాన ఆరోపణ. సాధారణ సమావేశాలు సైతం చాలా రోజులు నిర్వహించక అభివృద్ధికి మోకాలడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం కూటమి వార్డులపై ఫోకస్ పెట్టి.. వైఎస్సార్సీపీ వార్డులను, సభ్యులను టార్గెట్ చేశారు. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలకు ఏకీభవించకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తూ కక్ష సాధింపునకు దిగారు.
సిబ్బంది మధ్య విభేదాలు
కొద్ది రోజులుగా సిబ్బంది మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. చివరికి కుర్చీలు విసురుకోవడం మొదలు.. పెన్డౌన్ చేపట్టి విధులు బహిష్కరించే వరకూ వచ్చింది. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ విభాగం అధికారి రూబిన్ మధ్య చాలా రోజుల నుంచి పొసగడం లేదు. తనకు సంబంధించిన మెడికల్ బిల్లుల విషయమై ఆర్వో రూబిన్.. కమిషనర్ను కొద్ది రోజుల క్రితం నిలదీశారు. ఆ తరువాత తమను ఆర్వో దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కమిషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నల్లబ్యాడ్జీలతో కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. ఆ మరుసటి రోజే సెలవు విషయమై ఇద్దరి ఉద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. కార్యాలయంలోనే కేకలు వేసుకోవడంతోపాటు.. కుర్చీలు విసు రుకున్నారు. తాజాగా గురువారం కూడా ఆర్వో రూబిన్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగులు పెన్డౌన్కు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇప్పటికై నా చల్లారుతుందా, లేదా అన్నది చూడాలి. ప్రధానంగా కమిషనర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. ఆయనపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విచారణకు వచ్చిన ఆ శాఖ ఆర్డీ ఎదుట కూడా పలువురు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మున్సిపల్ సిబ్బంది అవినీతిపైనా ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకూ ఏ ఒక్కరిపైనా తీసుకున్న చర్యలు శూన్యం. కార్యాలయంలో పని చేస్తున్న మరికొంతమంది కూడా కమిషనర్ తీరుపై గుర్రుగా ఉన్నారు.
పాలన గాలికి..
సిబ్బంది మధ్య విభేదాలు, రాజకీయ కారణాలతో పుర పాలన పూర్తిగా గాడి తప్పింది. పట్టణంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మంచినీరు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు ఉద్యోగులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు తిరిగి.. తిరిగి విసిగిపోవాలే గానీ... ప్రయోజ నం ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పురం పరువు గోవిందా!