
డ్రగ్స్ రహిత జిల్లాకు భాగస్వాములు కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
పార్వతీపురంటౌన్: డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అసుతోష్ శ్రీవాస్తవతో కలిసి కలెక్టర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్సీఎం నుంచి బయల్దేరిన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే మత్తు పదార్థాల పట్ల అవగాహన ఉండాలని, దీని నియంత్రణకు విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని. అప్పుడే సమాజం నుంచి డ్రగ్స్ను పూర్తిగా రూపుమాపవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో డ్రగ్స్ ను రూపుమాపవలసిన గురుతర బాధ్యత విద్యార్థులపై ఉందని, దానికోసం ఈగల్ క్లబ్బులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పార్వతీపురంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామన్నారు. డ్రోన్ టెక్నాలజీ, సీసీ కెమెరాలు, చెక్పోస్టులను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట నిఘా పెట్టినట్లు చెప్పారు.
1,873 కేజీల గంజాయి స్వాధీనం
గతేడాది 22 గంజాయి కేసులను నమోదుచేసి 1,873 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 22 వాహనాలను సీజ్ చేశామని కలెక్టర్ చెప్పారు. గంజాయి సరఫరా చేసే వారిపై కూడా కచ్చితంగా కేసులను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సారా కూడా ఉంటుందని, దీనికోసం నవోదయం 2.0 కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. గంజా యి, సారా రహిత గ్రామాలుగా పార్వతీపురం మన్యం మన్యం జిల్లాను తీర్చిదిద్దాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయచంద్ర, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, పాలకొండ డీఎస్సీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, జిల్లా వైద్యారోగ్యరోగ్య శాఖాధికారి డా.ఎస్. భాస్కరరావు, యువత పాల్గొన్నారు.