
దోమల కాయిల్స్తో అనర్థాలు
● మార్కెట్లో విచ్చలవిడిగా నాశిరకం బ్రాండ్ల విక్రయాలు
● సహజ పద్ధతులే మేలంటున్న వైద్యులు
పార్వతీపురం: దోమకాటుతో అనారోగ్యానికి గురవుతామన్న భయంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్ను వాడడం పరిపాటిగా మారింది. మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్తో పాటు మస్కిటో అగరబత్తీలను విరివిగా వినియోగిస్తున్నారు. వాటి ద్వారా వచ్చే పొగతో దోమలు రావని భావించి వెలిగిస్తుంటారు. పొగ బయటకు పోకుండా ఇంట్లోని తలుపులన్నీ బిగించి ఈ కాయిల్స్ను వెలిగిస్తారు. ఈ పొగలో కార్సినోజెనిక్ రసాయనాలు కలిగిఉండడం వల్ల ఆస్తమా ఉన్న వారికి, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు శరీరంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిజానికి మస్కిటో కాయిల్స్ వినియోగం వల్లే కేవలం దోమలు చనిపోవడం లేదు. ఆ పొగ ఉన్నంత సేపు దోమలు సంచరించేందుకు వీలులేక మగతగా ఉండి వాసన తగ్గిన తరువాత అలాగే పొగ ప్రభావం తగ్గిన వెంటనే యథావిధిగా మళ్లీ దోమలు దాడికి పాల్పడతాయి. రోజురోజుకు దోమలు ప్రబలడంతో మార్కెట్లోకి నాశిరకం బ్రాండ్లు కూడా వచ్చి ప్రజల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.
ప్రకటనలతో మరింత ఆకర్షణగా..
గతంలో రీఫిల్స్ను 30, 35, 60 రాత్రులు పనిచేస్తాయంటూ విక్రయించేవారు. ప్రస్తుతం హై, లో ఆప్షన్లతో 45 ఎంఎల్ రీఫిల్స్ను విక్రయిస్తున్నారు. వాటిని హైలో పెట్టుకుంటే 10 నుంచి 15 రోజులు వస్తాయి. లో ఆస్షన్లో పెడితే 20 నుంచి 25రోజుల వరకు వస్తాయన్న ప్రత్యేకమైన ప్రకటనలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనంగా ఉన్నప్పటికీ ముందుముందు ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్యునిపుణులు హెచ్చరిస్తున్నారు, రీఫిల్స్లో ఉండే ప్రాలేత్రిన్, పెర్మేత్రిన్, ట్రాన్స్ఫ్లోత్రిన్ వంటి కృత్రిమ కీటక నాశకాలు వెలువడే పొగతో మన శ్వాసకోస వ్యవస్థ మరింత ప్రభావితం అవుతుంది. ఈ రసాయనాలు వాయువులో చేరి ఊపిరితిత్తులను బాధించి ఆస్తమా, బ్రాంకై టీస్ వంటి శ్వాససంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పార్వతీపురం, పాలకొండ, కురుపాం పరిసరాలలో ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
సహజ మార్గాలను ఉపయోగిస్తే మేలు
ప్రజలు ఈ దోమల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు కాయిల్స్, రీఫిల్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాడిన తరువాత గదిని బాగా వెంటిలేట్ చేయాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రసాయన రీఫిల్స్కు బదులు సహజ మార్గాలను ఉపయోగించాలి. నిమ్మ, లవంగం, తులసి వంటి సహజ పదార్థాల ద్వారా దోమలను దూరం చేసే ప్రయత్నాలు అనారోగ్యానికి గురిచేయండా మేలుచేస్తాయి. వీలైనంత మేరకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పడుకోవడానికి ఉపయోగించే బెడ్షీట్లు ఎండలో ఉంచుతూ శుభ్రం చేసుకోవాలి. కిటికీలు, వెంటిలేషన్స్కు మెస్ల అమరిక మంచిది. పడుకునే గదిలో గాలి ఆడేలా చూసుకుంటూ అవసరమైతే దోమతెరలు వినియోగించాలి. – డా.ఎన్ఎంకే తిరుమల ప్రసాద్,
పీహెచ్సీ వైద్యాధికారి, బందలుప్పి

దోమల కాయిల్స్తో అనర్థాలు