
రామయ్యా..చూడవేమయ్యా..!
● పవిత్ర బోడికొండను తవ్వేస్తున్న
అక్రమార్కులు
● మనోభావాలను దెబ్బతీస్తున్నారని భక్తుల ఆగ్రహం
● స్పందించని అధికార యంత్రాంగం
నెల్లిమర్ల రూరల్: సాక్షాత్తు శ్రీరాముడే నడయాడిన నేలగా రామతీర్ధాన్ని భక్తులు విశ్వసిస్తుంటారు. నీలాచలం పర్వతంగా పిలుస్తున్న రామతీర్థంలోని బోడికొండపై పాండవులు సంచరించినట్లు చరిత్ర చెబుతోంది. కొండపై శ్రీ కోదండరాముడి ఆలయంతో పాటు అలనాటి చారిత్రక గుర్తులను చూసేందుకు సందర్శకులు నిత్యం కొండపైకి వెళ్తుంటారు. అంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన బోడికొండను సైతం అక్రమార్కులు విడిచిపెట్టడం లేదు. గడిచిన కొద్ది నెలలుగా ధనార్జనే లక్ష్యంగా శ్రీరాముడి కొండనే తవ్వేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సీతారామునిపేట జంక్షన్ సమీపంలో ఉన్న కొండవద్ద గడిచిన కొన్ని రోజులుగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సమీప గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో కొందరు అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి కొండను తవ్వేస్తున్నారు. పట్టపగలే ఈ వ్యవహారం జరుగుతున్నా..ఇటు దేవస్థానం అధికారులు కానీ, అటు రెవెన్యూ యంత్రాంగం కానీ స్పందించకపోవడం బాధాకరం. కొండపై ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు సైతం కిందపడుతున్నాయంటే తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ట్రాక్టర్ లోడును పరిధిని బట్టి రూ.600 నుంచి రూ.1000 వరకు అమ్మేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రహదారి పక్కనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వ భూములకు ఎలాగూ రక్షణ లేదు సరికదా.. సాక్షాత్తు దేవుడి కొండనైనా అక్రమార్కుల నుంచి కాపాడలేరా..? అంటూ భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బోడికొండను తవ్వేస్తున్న అక్రమార్కులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రామయ్యా..చూడవేమయ్యా..!