
నేడు జగన్నాథుని రథయాత్ర
విజయనగరం టౌన్: జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్వామివారికి గురువారం వేకువజామునుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సంతపేట, దాసన్నపేట, మన్నార్ రాజ గోపాలస్వామి ఆలయం ఆవరణలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళావాహన, బింబ దర్శనం, నేత్రోత్సవం, ప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం స్వామివారి శాంతి కల్యాణోత్సవం, రాత్రి రథోత్సవానికి స్వామివారిని సిద్ధం చేశారు. రక్షాబంధనాలు ధరించారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు మేళతాళాలతో స్వామివారి రథారోహణ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు, కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్ను ఆర్డీఓ జేవీవీ రామ్మోహనరావు గురువారం పట్టుకున్నారు. ట్రాక్టర్ను నిలువరించేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్డీఓ ఆదేశాల మేరకు మెట్టవలసలోని యజమాని మీసాల చంద్రశేఖర్ ఇంటి వద్ద ట్రాక్టర్ను ఆర్ఐ రామకుమార్, సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ తరలింపు, ఆపకుండా వెళ్లిపోయినందుకుగాను రూ.20వేల జరిమానా విధించామని ఆర్ఐ రామకుమార్ తెలిపారు.
బ్యాటరీల చోరీ
● ఆందోళన చెందుతున్న వాహన యజమానులు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలస ఫ్లైఓవర్ కింద పార్కింగ్ చేసి ఉంచిన మూడు లగేజీ వ్యాన్లు, ఒక లారీకి ఉన్న బ్యాటరీలను గుర్తుతెలియని దుండగులు అపహరించారని వాహన యజమానులు ఆందోళన చెందారు. గతంలో కూడా ఎన్నోమార్లు ఈ విధంగా వాహనాలకు ఉన్న బ్యాటరీలను వైర్లను చిందరవందరంగా కోసి దొంగిలించారని వాపోయారు. ఈ మేరకు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గురువారం ఉదయం వాహనాల వద్దకు వెళ్లేసరికి వైర్లు కట్చేసి ఉండడంతో బ్యాటరీలు లేకపోవడాన్ని గమనించినట్లు తెలిపారు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దాడికి గురైన వ్యక్తి మృతి
బొబ్బిలి: పట్టణ పరిధిలోని గ్రోత్సెంటర్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ స్టోర్లో వాచ్మన్గా పనిచేస్తున్న కనిమెరకల వెంకటరమణ(55) పై ఈనెల 20న గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. వెంకట రమణ కుమారుడు పురుషోత్తమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె.సతీష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే వెంకట రమణ విధులకు హాజరయ్యాడు. సరిగ్గా రాత్రి 12.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కంపెనీలోకి ప్రవేశించి బలమైన ఆయుధంతో వెంకటరమణ ముఖం, తలపై బలంగా దాడి చేశాడు. దీంతో వెంటనే స్థానికులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మూడు టీమ్లను నియమించామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.