
వృద్ధిరేటు పెరిగేలా ప్రణాళికలు
పార్వతీపురంటౌన్: వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో వృద్ధిరేటు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. సుపరిపాలన కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వ శాఖాధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్యామ్ప్రసాద్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా ప్రతి ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, తృణధాన్యాలు, డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణతో అధిక ఆదాయం పొందాలని అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా పాల దిగుబడి గతేడాది కంటే ఈ ఏడాది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని, పశు సంపదను ప్రోత్సహించడంతో అధిక ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రగతిలో వృద్ధి రేటు గణనీయంగా పెరగాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, అటవీ, పశుసంవర్థక, వైద్యారోగ్య, ఇంటర్మీడియట్ విద్యశాఖల అధికారులు పి.వీర్రాజు, కె.రాబర్ట్ పాల్, వై.క్రాంతి కుమార్, వై.శ్రీదేవి, జేపీఏ ప్రసూన, డా.ఎస్.మన్మథ రావు, డా.ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, డీఆర్డీఏ పీడీలు ఎం.సుధారాణి, డా.టి.కనకదుర్గ, వై.నాగేశ్వరరావు, పరిశ్రమల కేంద్రం ఎ.డి పి.సీతారాము, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఆర్అండ్బీ ఇరిగేషన్ ఈఈలు ఒ.ప్రభాకరరావు, ఎస్.రామచంద్రరావు, డీఎస్.ప్రదీప్, ఎ.ఢిల్లీశ్వర రావు, పంచాయతీ రాజ్ డీఈఈ కె.సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్