
దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: దేవస్థానం భూముల్ని అన్ని విధాలా పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా స్థాయి దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 11 వేల ఎకరాల భూమి దేవదాయ శాఖ పరిధిలో ఉందని అందులో కొంత ఆక్రమిత భూమి ఉందని, ఈ భూమికి వెంటనే సర్వే చేయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే మాన్సాస్ ట్రస్టుకు చెందిన భూమిలో కూడా ఆక్రమణలు ఉన్నాయని, ఇందులో వ్యవసాయ, నివాస, వాణిజ్య పరంగా ఆక్రమించిన వివిధ సంస్థల ఆక్రమిత భూములకు సంబంధించి రూ.50 లక్షల వరకు యూజర్ చార్జీల కింద ఆక్రమణదారులు చెల్లించారని తెలిపారు. అయితే ఎటువంటి యూజర్ చార్జీలు చెల్లించకుండా కమర్షియల్గా వినియోగిస్తున్న దేవదాయ భూముల్లోని సముదాయాలను తొలగించాలని, అందుకు రెవెన్యూ అధికారులు పోలీస్ వారి సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. భూముల విషయంలో కోర్టు ఆర్డర్స్ను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. మ్యుటేషన్స్ చేయవలసిన వాటి వివరాలను మండలాల వారీగా ఆర్డీఓలకు అందజేయాలని, ఆర్డీఓలు వెంటనే మ్యుటేషన్ జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, దేవదాయశాఖ ఎ.సి శిరీష, ఆర్డీఓలు సవరమ్మ, రామ్మోహన్ రావు, ఆశయ్య, సర్వే ఎ.డి రమణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, డీఎస్పీ వీరకుమార్, డిప్యూటీ కమిషనర్, ఏఓలు పాల్గొన్నారు.