
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
శృంగవరపుకోట: ఇంటిముందు మావిడాకుల తోరణాలు వాడనేలేదు. పెళ్లింట సందడి ముగియనే లేదు. విధి ఆడిన ఆటలో నవవరుడు ప్రాణాలు చాలించాడు. తాళికట్టిన భర్త తరలిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి నవవధువు శోకంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లగుడు ప్రదీప్(26)కు ఇటీవల పెళ్లయింది. ప్రదీప్ తల్లితో కలిసి గురువారం గడ్డి కోసేందుకు వెళ్లాడు. గడ్డిమోపు పట్టుకుని తిరిగి వస్తున్న సమయంలో తెగి ఉన్న విద్యుత్ తీగ తగిలి షాక్కు గురయ్యాడు. దీంతో తల్లి అరుపులతో పక్క పొలాల్లో ఉన్న గ్రామస్తులు పరుగున వచ్చి చూసేసరికే ప్రదీప్ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. భర్త పార్ధివదేహాన్ని చూసి భార్య ఏడుస్తుంటే గ్రామస్తుల కళ్లు చెమర్చాయి. కాగా ఈ ఘటనపై ఇటు విద్యుత్శాఖ అధికారులు కానీ, అటు పోలీస్ ఉద్యోగులు కానీ నోరు మెదపలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.