
మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని మహిళల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మిషన్మత్స్యశక్తి, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్, గిరిబజార్ నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు సహాయం అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచి, సమాజంలో సమాన భాగస్వాములుగా చేయడానికి ఉద్దేశించిన ఒక సమగ్ర కార్యక్రమమే ‘మిషన్ మత్స్యశక్తి’ అని వివరించారు. జిల్లాలో రూ.479 కోట్లుగా ఉన్న మత్స్య సంపద ద్వారా వస్తున్న జీడీపీని రూ.600 కోట్లకు పెంచాలన్నారు. దర్తీ అభాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద 90 శాతం రాయితీ రుణాలకు 165 గిరిజన గ్రామాల ప్రజల నుంచి ఈ నెల 30లోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. కనీసం 100 ఫిష్ పాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా కోటి చేపపిల్లలు దిగుబడి రావాలని కలెక్టర్ ఉద్బోధించారు.
● జిల్లాలో ఏర్పాటు చేసే జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు సిద్ధం కావాలని ఐటీడీఏ పీఓను కలెక్టర్ ఆదేశించారు. యూనిట్ నిర్వహణలో భాగంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.
● గిరిబజారు వాహనాలను అప్పగించనున్నామని, వాటితో గిరిజన ప్రాంతాల్లో సరుకులను విక్రయించవచ్చన్నారు.
నేడు నిషాముక్త్ భారత్ ర్యాలీ
నిషాముక్త్ భారత్ కార్యక్రమాన్ని గురువారం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇందులో యువత, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నిషాముక్త్భారత్ ర్యాలీని మధ్యాహ్నం 3 గంటల నుంచి పార్వతీపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన అనంతరం కార్యాలయ సెల్లార్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, ఏపీఓ ఎ.మురళీధర్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, పార్వతీపురం మత్స్యకార అధికారి శ్రీదేవి, జిల్లా పశుసంవర్థక అధికారి డా.ఎస్.మన్మథరావు, జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి కె.సాయికష్ణ చైతన్య, ఎల్డిఎం ఎన్.విజయ్స్వరూప్, నాబార్డు ఏజీఎం దినేష్, కేవీకే శాస్త్రవేత్త డా.శ్రీనివాస్రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్