
వీఆర్ఏల నిరసన హోరు
పార్వతీపురం టౌన్: ఒకటిరెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదిగా ఆందోళనలు చేస్తున్నాం. వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు లేవు. చాలీచాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు లేరు. ఖాళీలు భర్తీచేయకపోవడంతో అదనపు పనిభారం పడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. నెలకు ఇచ్చే రూ.11,000 వేతనంతో కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నామంటూ అధికారులకు గోడు వినిపించారు. వీరికి మద్దతుగా సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా నిరసనలు తెలిపినా.. వినతి పత్రాలు అందజేస్తున్నా సమస్యలు పరిష్కరించేవారు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వలే ఇక్కడా వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అటెండర్, నైట్ వాచ్మన్లుగా వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని, అదనపు విధుల నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రెడ్డి వేణు, గొర్లి వెంకటరమణ, వీఆర్ఏలు పాల్గొన్నారు.
ఆర్థిక కష్టాలు
వీఆర్ఏలకు నెలకు ఇచ్చే వేతనం కేవలం రూ.11,000. జిల్లా వ్యాప్తంగా 338 మంది వీఆర్ఏలు ఆర్థికంగా చితికిపోతున్నారు. మహిళలు అని చూడకుండా నైట్ వాచ్మన్ విధులకు పంపుతున్నారు. ఖాళీగా ఉన్న వాచ్మన్, అటెండర్ పోస్టులు భర్తీ చేయాలి. అదనపు పనిభారం నుంచి విముక్తి కలిగించాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయినా మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తాం. – ఈశ్వరరావు, వీఆర్ఏల సంఘం
జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం

వీఆర్ఏల నిరసన హోరు