త్రుటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

Jun 26 2025 6:17 AM | Updated on Jun 26 2025 6:17 AM

త్రుట

త్రుటిలో తప్పిన ప్రమాదం

అంగన్వాడీ కేంద్రం శ్లాబ్‌కు ఊడిన పెచ్చులు

మెంటాడ: మండలంలోని కుంటినవలసలో రెండవ అంగన్వాడీ కేంద్రం శ్లాబ్‌ పెచ్చులు రాలడం ఆందోళన కలిగించింది. బుధవారం కేంద్రంలో 17 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడే వచ్చిన ఆ గ్రామ యువతిపై ఆ పెచ్చులు పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన అంగన్వాడీ సూపర్‌వైపర్‌ హైమావతి వచ్చి ఆ పిల్లలను ఇళ్లకు పంపించారు. పిల్లలకు ఏమీకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం శ్లాబ్‌ కింద పిల్లలను ఉంచి కేంద్రాన్ని నడపడంపై పలువురు విమర్శలు చేసిన పట్టించుకోక పోవడం గమనార్హం.

కూలిన వైన్‌షాపు ముందుభాగం

బొబ్బిలి: పట్టణంలోని మేదరి బంద వద్ద గల మద్యం దుకాణ భవనం శ్లాబ్‌ ముందుభాగం బుధవారం కూలిపోయింది. అదృష్టవశాత్తు మద్యం కొనుగోలుకు ఆ సమయంలో ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న ఎకై ్సజ్‌ సీఐ పి.చిన్నం నాయుడు అక్కడికి వెళ్లి దుకాణం మూసివేయించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మద్యం దుకాణాన్ని మార్పు చేశాక తిరిగి తెరిచేందుకు అనుమతిస్తామని వ్యాపారులకు తెలియజేశారు.

గురుదేవాలో చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్టు

మిస్టరీగా చోరీ సొత్తు రికవరీ

కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీష్‌బాబు ఇంట్లో గత నెల 28వ తేదీన దొంగలు చొరబడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన పార్థగ్యాంగ్‌లో ఒకరిని మహారాష్ట్ర వెళ్లి పట్టుకుని అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో మహారాష్ట్రలోని బుల్దాన్‌ జిల్లాకు చెందిన ముత్తుపవర్‌ అక్షయ్‌, లక్ష్మణ పవర్‌లను అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్లు సీఐ షణ్ముఖరావు బుధవారం తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ కేసులో కేవలం నిందితులను మాత్రమే పట్టుకుంటున్నట్లు పోలీసులు చూపుతున్నారే తప్ప ఎక్కడా చోరీకి గురైన సొత్తును రికవరీ చేస్తున్నట్లు చెప్పకపోవడం కొసమెరుపు. ఈ చోరీలో సుమారు 10కేజీల బంగారం,రూ 50లక్షలకు పైగా నగదు మాయమైనట్లు సమాచారం.

నేడు ఫెన్సింగ్‌ క్రీడాకారుల ఎంపిక

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాల, బాలికల ఎంపిక పోటీలు ఈనెల 26న నిర్వహించనున్నట్లు జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ముఖ్య శిక్షకుడు డీవీ.చారి ప్రసాద్‌ బుధవారం తెలిపారు. నగరంలోని విజ్జి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి అండర్‌ –10, 12 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో అండర్‌–10 విభాగంలో 2016 జనవరి 1వ తేదీ అనంతరం, అండర్‌–12 విభాగంలో 2014 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా స్పష్టం చేశారు. క్రీడాకారులు విధిగా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని మరిన్ని వివరాలకు ఫోన్‌ 8374737707 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం1
1/2

త్రుటిలో తప్పిన ప్రమాదం

త్రుటిలో తప్పిన ప్రమాదం2
2/2

త్రుటిలో తప్పిన ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement