
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరగాలని, గురువారం జిల్లావ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డిజిటల్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, వీఆర్ఓలు, ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొనాలని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4,132 మంది 1వ తరగతి విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అవన్నీ ఈ డ్రైవ్ ద్వారా భర్తీ కావాలని తేల్చిచెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో చేరి ఆన్లైన్లో నమోదు కాని వారి వివరాలను రానున్న రెండు రోజుల్లో పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఇందుకు తల్లితండ్రులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, డ్రాపౌట్ విద్యార్థులను కూడా బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తల్లికి వందనం కార్యక్రమంపై విద్యాశాఖాధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో పాటు అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు పెరగాలని, ఆ దిశగా తల్లితండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్, నోడల్ అధికారి డి.మంజులవాణి, ఐసీడీఎస్ పీడీ డా.టి.కనకదుర్గ, ఎంఈఓలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
27న సుపరిపాలన కార్యక్రమం
సుపరిపాలన కార్యక్రమం ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎ శ్యామ్ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఎస్.మన్మథ రావు, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, జిల్లా విపత్తు స్పందన/అగ్నిమాపక అధికారి పి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టాలి
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్