
ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతకు బైక్స్
● అత్యాధునిక టెక్నాలజీతో తయారీ
● జిల్లాకు వచ్చిన 16 బైక్స్
విజయనగరం క్రైమ్: జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత కోసం కొత్తగా 16 మోటార్ సైకిల్స్ జిల్లా కేంద్రానికి వచ్చాయని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. డీజీపీ ఆఫీస్ నుంచి జిల్లాకు వచ్చిన బైక్స్ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ విధులను సమర్థవంతంగా నిర్వహిచేందుకు ఆ బైక్స్ను ఉపయోగిస్తామన్నారు. వాటిలో 15 టీవీఎస్ అపాచీ మోటార్సైకిల్స్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉన్నాయని తెలిపారు. ఈ మోటార్ సైకిల్స్ను సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు. జిల్లాలో ట్రాఫిక్ అవాంతరాలు తరచూ ఏర్పడుతున్న పోలీస్స్టేషన్లకు అలాగే రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న స్టేషన్లకు వాటిని కేటాయించనున్నా మని తెలిపారు. ఫోర్వీలర్స్ వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మోటార్ సైకిల్స్ వినియోగించి, పోలీస్ సిబ్బంది, అధికారులు చేరుకునే అవకాశముంటుందన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రమాదాల నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, ఆర్ఎస్సై(ఎంటీఓ) ఆర్.రమేష్ కుమార్, ఆర్ఎస్సై (అడ్మిన్) ఎన్.గోపాలనాయుడు పాల్గొన్నారు.