
జిల్లా వేదికగా జాతీయ చెస్పోటీలు
● ఈనెల 28 వరకు జరగనున్న దివ్యాంగుల జాతీయ చెస్ చాంపియన్షిప్
● పోటీలకు హాజరైన 16 రాష్ట్రాలకు
చెందిన 150 మంది క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయి చెస్ పోటీలకు విజయనగరం వేదికగా నిలిచింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం సారథ్యంలో నిర్వహించ తలపెట్టిన 5వ జాతీయ స్థాయి దివ్యాంగుల చెస్ చాంపియన్ షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో నిర్వహిస్తున్న పోటీలను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పోటీలకు వచ్చిన క్రీడాకారులను ఆమె అభినందించారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన 150 మంది దివ్యాంగ క్రీడాకారులు మంగళవారం జిల్లాకు చేరుకున్నారన్నారు. వారందరికీ మంగళవారం అన్ని రకాల మెడికల్ చెకప్ చేశామని చెప్పారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు అంతర్జాతీయ పోటీలకు వెళ్లనున్నారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.