కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం టౌన్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాలూరు శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న ఉదయం 9 గంటలకు జాబ్మేళా జరగనుందని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డీగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్మేళాకు అర్హులని తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన యువకులు httpr://nai punyam.ap.gov.in వెబ్సైట్లో పేరు నమోదు చేసుకొని, రిఫరెన్స్నంబర్తో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్ఫొటోతో జాబ్మేళాకు హాజరు కావాలని కోరారు. 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 94947 77553, 73825 59022 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
డాక్టర్ ప్రతిభ
పాలకొండ రూరల్: పాలకొండ పట్టణానికి చెందిన వినోద్కుమార్ ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో సత్తాచాటారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో వినోద్ జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని తండ్రి గణపతీశ్వరరావు, తల్లి పద్మకుమారి తెలిపారు. పాలకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన వినోద్ ఎంబీబీఎస్ విద్యను శ్రీకాకుళం రిమ్స్లో, ఎంఎస్ జనరల్ సర్జన్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో పూర్తిచేశారు. రాగోలు జెమ్స్లో సీనియర్ రెసిడెంట్గా విధులు నిర్వహించారు.
మోహన్కాలనీ కొండల్లో ఏనుగులు
సీతంపేట: మోహన్కాలనీ కొండ శిఖర పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. చిన్నబగ్గ టేకు ప్లాంటేషన్ నుంచి అక్కడకు వెళ్లిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ ఎఫ్బీఓ దాలినాయుడుతో పాటు ట్రాకర్లు ఎప్పటికప్పుడు ఏనుగుల గమనాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పక్కి గ్రామానికి గజరాజుల గుంపు
బొబ్బిలి రూరల్: మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తొమ్మిది ఏనుగుల గుంపు మంగళవారం పక్కి గ్రామ పరిసరాల్లోకి చేరుకున్నాయి. సీతానగరం మండలం నుంచి ముత్తాయివలస, కమ్మవలస, శివడవలస మీదుగా పక్కి గ్రామ పరిసరాల్లోని అరటితోటలకు చేరుకుని ధ్వంసం చేస్తున్నాయి. స్థానిక ప్రజలను అటవీ సిబ్బంది అప్రమత్తం చేశారు.
భక్తిశ్రద్ధలతో దీపారాధన
నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామి దేవస్థానంలో ఆంజనేయస్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి తమలపాకులు, సింధూరంతో అర్చనలు చేసినానంతరం హనుమాన్ చాలీషా పఠనం చేశారు. సాయంత్రం స్వామి సన్నిధిలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో దీపారాధన చేపట్టారు.