
డ్రోన్తో దోమల నివారణ మందు పిచికారీ
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో మలేరియా నియంత్రణలో భాగంగా డ్రోన్లతో దోమల నివారణ మందు పిచికారీకి శ్రీకారం చుట్టామని డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ పరిధి గౌడుగూడ గ్రామంలో డ్రోన్తో దోమల నివారణ మందు పిచికారీ ప్రక్రియను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రోగ్రాం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న నీటినిల్వ కుంటలపై టెమీఫాస్ మిశ్రమాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో దోమల నివారణ చర్యలకు సాంకేతికత దోహదపడుతుందన్నారు.
గ్రామాల్లో జ్వరనిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు మందులు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. దీనికి ముందు ఆయన టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరాతీశారు. సిక్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆయన వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి వై.మణి, ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్రావు, డీఎల్ఏటీఓ డాక్టర్ వినోద్, తాడికొండ పీహెచ్సీ వైద్యులు అభిలాష్, మలేరియా కన్సల్టెంట్ రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు