
రైలులోనుంచి జారి పడి వ్యక్తి మృతి
సీతానగరం: మండలంలోని చినభోగిలి వద్ద విజయవాడ పాసింజర్ రైలులో నుంచి జారిపడి మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినభోగిలి గ్రామానికి చెందిన సవరపు మనోజ్(18) విశాఖపట్నం నుంచి విజయవాడ పాసింజర్లో వస్తూ సీతానగరం రైల్వేస్టేషన్లో దిగాల్సి ఉంది. అయితే స్వగ్రామానికి వచ్చే సమయానికి ముందుగానే రైలులోనుంచి జారిపడి మనోజ్ మృతి చెందినట్లు గుర్తించామని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తరలించారు.
పురుగు మందు తాగి వ్యక్తి..
కొమరాడ: మండలంలోని కళ్లికోట గ్రామానికి చెందిన మక్కా వ్యాపారినాయుడు(49) ఈనెల 3తేదీన మద్యం మత్తులో పురుగు తాగేయడంతో అస్వస్థతకు గురికాగా పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చిక్సిత కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య గౌరీశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కొమరాడ ఎస్సై నీలకంఠం మాట్లాడుతూ పోస్టుమార్టం నిమత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
వ్యాన్ ఢీకొని వ్యక్తి..
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మున్సిపాలిటీలోని వివేకానంద కాలనీ గణేష్ రామ వీధికి చెందిన పతివాడ శ్రీను (52) వ్యాన్ ఢీకొని మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పతివాడ శ్రీను కొత్తవలస శివారులో నూడిల్స్, చికెన్ అమ్ముతూ ఉంటాడు. మంగళవారం మోటార్ సైకిల్పై ఇంటి నుంచి పార్వతీపురం పట్టణంలోకి వస్తుండగా రాయగడ రోడ్డులోని సాహు హాస్పిటల్ సమీపంలో రాయగడ నుంచి గుడ్లు లోడుతో వస్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు.
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
రాజాం సిటీ: మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కె.అఖిల (23) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కంటు చండీ ప్రసాద్కు గరివిడి మండలంలోని మందిరివలస గ్రామానికి చెందిన అఖిలతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. మంగళవారం ఉదయం ఆమెకు ఒక్కసారిగా భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెకు సపర్యలు చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

రైలులోనుంచి జారి పడి వ్యక్తి మృతి