
తహసీల్దార్ ఎక్కడ?
● 10 రోజులుగా స్తంభించిన రెవెన్యూ సేవలు
● అయోమయంలో పూసపాటిరేగ మండల ప్రజలు
పూసపాటిరేగ: పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విధుల్లో చేరి రోజు తిరగక ముందే వచ్చిన స్థానానికే మళ్లీ వెనక్కి వెళ్లడంతో పూసపాటిరేగ మండల ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈనెల 13వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి ఎన్వీ రమణ తహసీల్దార్గా పూసపాటిరేగలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన మరుసటి రోజు నుంచే ఏమైందో ఏమో కానీ ఆయన విధులకు హాజరు కావడం లేదు. తహసీల్దార్ కార్యాలయానికి ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన విద్యార్థులు, ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇంటర్వ్యూలు, విద్యాసంస్థల్లో జాయిన్ అవడానికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కనీసం ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా ఇబ్బందులు ఉండేవి కావని పలువురు వాపోతున్నారు. గంటల వ్యవధిలో ఉద్యోగంలో చేరడం, వెనక్కి వెళ్లడం ఏమిటనేది అంతు చిక్కని ప్రశ్నగా పూసపాటిరేగ మండల ప్రజలకు మిగిలింది. పూసపాటిరేగ తహసీల్దార్గా పనిచేసిన తాడ్డి గోవిందను కలెక్టరేట్లోని ‘సి’ సెక్షన్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సాలూరు నుంచి ఎన్వీ రమణ వచ్చి విదుల్లో చేరారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ తహసీల్దార్ను రిలీవ్ చేయకుండానే పూసపాటిరేగలో ఆయన విధుల్లో చేరడంతో ఆగ్రహించిన కలెక్టర్ తహసీల్దార్ను వెనుక్కి పిలిచారని ఓవాదన వినిపిస్తుండగా, మరో వాదన మాత్రం రాజకీయంగానే తహసీల్దార్ను వెనక్కి పంపించారని బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నియామకంపై చర్చ జరుగుతోంది. కనీసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కనీసం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనీసం ఇన్చార్జ్ తహసీల్దార్ను అయినా నియమించి ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సమస్య పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.