
డీఏ జుగా కార్యక్రమానికి విశేష స్పందన
పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమం జిల్లాలో బాగా జరుగుతోందని, గిరిజన ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెనన్స్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 30 వరకు డీఏ జుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతిని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తమకు కావలసిన అవసరాలను, ధ్రువపత్రాలను, మౌలిక వసతులను ఎక్కువగా కోరుతున్నట్లు చెప్పారు. అలాగే పీఎం జన్మన్ గృహాలను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం అమలుచేసే పథకాలతో గిరిజన ప్రాంతాల్లో సేవలు, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమన్నారు. గ్రామ, క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అందించేలా జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
గిరిజనులు వినియోగించుకోవాలి
ఈ నెల 30 వరకు గిరిజనులకు అవసరమయ్యే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్ కార్డులు, జన్ధన్ ఖాతా, పీఎం జేజేబీవై, పీఎం ఎస్బీవై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధిహామీ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పీఎం ఎంవీవై, ఇమ్యునైజేషన్ తదితర సీ్త్ర శిశు సంక్షేమ ప్రయోజనాలను గిరిజన ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ వివరించారు. పీవీటీజీ గృహాలు, గిరిజన గ్రామాలను గుర్తించడం, గ్రామ, క్లస్టర్ స్థాయి శిబిరాలను నిర్వహించడం, ఆరోగ్యం, ఆహారం, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, వ్యవసాయం, రెవెన్యూ ఇతర విభాగాల సమన్వయంతో కార్యకలాపాలు చేపట్టాలన్నారు. ఆధార్, ఈ– కేవైసీ డాక్యుమెంటేషన్ సంబంధిత సేవల కోసం సంబంధిత విభాగాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఆధార్లో నమోదు కాని వారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని, గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్