
సర్వజన ఆస్పత్రిలో పనిచేయని ఎంఆర్ఐ
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఎన్.సతీష్ తీవ్రమైన నడుం నొప్పితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎముకల విభాగానికి వెళ్లాడు. ఎంఆర్ఐ స్కాన్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. అయితే ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోవడంతో స్కాన్ బాగైన తర్వాత ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పడంతో వెనుదిరిగాడు. ఇలా అనేక మంది రోగులు ఎంఆర్ఐ స్కాన్ కోసం వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా పనిచేయకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ ఉన్నప్పటికీ రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు వెళ్లాల్సిన పరిస్థితి.
అధిక మొత్తంలో వెచ్చిస్తున్న రోగులు:
ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఎంఆర్ఐ కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో స్కానింగ్కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేక రోగులు చేయించుకుంటున్నారు.
ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్న రోగులు
వారం రోజులుగా ఇదే పరిస్థితి
త్వరలో బాగు చేయిస్తాం
ఎంఆర్ఐ స్కాన్ ప్రస్తుతం పనిచేయడం లేదు. ఎంఆర్ఐ స్కాన్ అత్యవసరమైన వారికి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఉచితంగా తీయిస్తున్నాం. ఎంఆర్ఐ స్కాన్ను త్వరితగతిన బాగు చేయిస్తాం.
డాక్టర్ ఎస్.అప్పలనాయుడు,
సూపరింటెండెంట్, ప్రభుత్వసర్వజన ఆస్పత్రి