
పునరావాస సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూ సేకరణ చట్టప్రకారం సంపూర్ణమైన పునరావాస సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కొండ మొదలు సర్పంచ్ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలో ఉన్న రహదారిపై ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్కు చేరుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకుడు శ్రీనునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ 2013 భూసేకరణ చట్టప్రకారం సమస్యలు పరిష్కరించాలని, నేటికి 18ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదని, తక్షణమే అందించాలని, నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించి డీపట్టా సాగు చేస్తున్న ఆదివాసీలకు పూర్తి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ హేమలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న పలు గిరిజన గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.