
గంజాయి వ్యాపారి ఆస్తుల సీజ్
విజయనగరంక్రైమ్: జిల్లాలోని రామభద్రపురం పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి ఆక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడైన శెట్టి ఉమామహేశ్వరరావు ఆలియాస్ హుస్సేన్ ఆలియాస్ పుతిన్కు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన స్తిరాస్తులు సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. విశాఖలో ఉంటున్న ఉమామహేశ్వరరావు కొంతమంది సహచరులతో కలిసి 147 కేజీల గంజాయిని తరలిస్తూ రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడ్డాడన్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినప్పటికీ విచారణలో ఉమామహేశ్వరరావును ప్రధాన నిందితుడిగా గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్ 25న పీటీ వారెంట్తో అరెస్టు చేశామన్నారు. విచారణలో 2019 నుంచి 2025 మధ్యకాలంలో ఉమామహేశ్వరరావుతో పాటు ఆయన భార్య స్వరూపరాణి, సోదరుడు వెంకటరావు పేరిట రూ.కోటి 89 లక్షల 84,768 ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని, ఇంక ఎవరూ కొనుగోలు చేయకుండా చట్టపరమైన నోటీసు జారీ చేశామన్నారు. ఈ కేసు విచారణలో ప్రధాన నింధితుడైన శెట్టి ఉమామహేశ్వరరావుపై అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ సిటీల్లో 7కు పైగా గంజాయి కేసులు నమోదయ్యా యని తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న అదనపు ఎస్పీ సౌమ్యలత, బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు, రామభధ్రపురం ఎస్సై ప్రసాదరావులను ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.