
ఏడు నెలలకే ఏపీఎం బదిలీ!
జియ్యమ్మవలస రూరల్: ఎక్కడైనా ఐదేళ్ల సర్వీసు పైబడిన, రిక్వెస్టు లెటర్ పెట్టుకున్న ఉద్యోగులను బదిలీ చేయడం పరిపాటి. కూటమి ప్రభుత్వంలో అడ్డగోలు బదిలీలతో ఉద్యోగవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జియ్యమ్మవలస మండలం ఏపీఎంగా పనిచేస్తున్న కె.త్రినాథమ్మ బాధ్యతలు చేపట్టిన ఏడు నెలలకే టీడీపీ నాయకులకు నచ్చలేదట. నియోజకవర్గ టీడీపీ నేతపై ఒత్తిడి తెచ్చి మరీ బదిలీచేయించారన్న చర్చ మండలంలో జోరందుకుంది. దీనిని మండల ప్రజాప్రతినిధి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. త్రినాథమ్మ స్థానంలో కొత్త ఏపీఎంగా పార్వతీపురం వెలుగు కార్యాలయం నుంచి బొంతాడ శివున్నాయుడు నియమించినట్టు చెబుతుండగా, తనకు సీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి రిలీవింగ్ ఆర్డర్ అందలేదని త్రినాథమ్మ తెలిపారు.
రేగులగూడ కొండపై ఏనుగులు
సీతంపేట: మండలంలోని వెంపలగూడ–రేగులగూడ మధ్య సంచరించిన నాలుగు ఏనుగుల గుంపు శనివారం రేగులగూడ కొండపైకి చేరుకున్నాయి. కొండపోడు పనులకు వెళ్లిన గిరిజనులంతా భయాందోళనతో పరుగు తీశారు. ఎఫ్బీఓ దాలినాయుడు, ట్రాకర్లు ఏనుగుల సంచారాన్ని తెలుసుకుని ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏనుగులను కవ్వించవద్దని సూచిస్తున్నారు.
విజయనగరం భారీ స్కోర్
విజయనగరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో శనివారం నుంచి ప్రారంభమైన అంతర్ జిల్లాల మూడు రోజుల క్రికెట్ మ్యాచ్లో విజయనగరం భారీ స్కోర్ సాధించింది. విజయనగరం జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రీరామ్ సచిన్ అద్భుతంగా ఆడి 80 బంతుల్లో 152 పరుగులు సాధించడంతో తొలి రోజే విజయనగరం 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు తొలి రోజు 83.5 ఓవర్లలో 411 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ లోహిత్ రెడ్డి (91 పరుగులు), కార్తికేయ (63 పరుగులు) అర్థ సెంచరీలతో రాణించారు. ఆట ముగిసే సమయానికి శ్రీకాకుళం జట్టు నాలుగు ఓవర్లు వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు సాధించింది. వేగంగా ఆడి సెంచరీ సాధించిన శ్రీరామ్ సచిన్ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు ట్రెజరర్ పీఎస్ఎన్ వర్మ, సెలెక్టర్ సర్పరాజ్ అభినందించారు.

ఏడు నెలలకే ఏపీఎం బదిలీ!