
సంగీతంలో సాగరమంత సంగతులు
విజయనగరం: సంగీతంలో సాగరమంత సంగతులు ఉంటాయని, సంగీతం సార్వజనీనమైనదని సంగీత విద్వాంసురాలు, వరలక్ష్మీ త్యాగరాజ సంగీత నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు లక్ష్మీరామదాసు అన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో కోడకూడలి వద్ద ఉన్న ఓ ప్రైవేటు అతిథిగృహంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సంగీతం మనోల్లాసాన్ని కలిగించే కళగా పేర్కొన్నారు. నిర్దిష్టమైన స్వర లయలతో కూడిన శృతి బద్ధమైన సంగీత ధ్వనులు మనసును సేదతీర్చి ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయన్నారు.
సంగీతం శిశువులను, పశువులను, చివరకు పాములను కూడా రంజింపజేస్తుందని తెలిపారు. ఆరు లలిత కళల్లోనూ పండిత పామరులను ఉర్రూతలూగించగల కళ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ రామదాసును సమాఖ్య అధ్యక్షుడు గురు ప్రసాద్, శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ మార్కెట్ పూర్వ అధ్యక్షుడు పులిపాటి రామారావు, ఎం.సుభద్రాదేవి, తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఆలపించిన గీతాలు శ్రోతులను అలరించాయి.
సంగీత విద్వాంసురాలు లక్ష్మీరామదాసు