
కూటమి నిర్లక్ష్యం.. తోటపల్లికి శాపం
వీరఘట్టం/పాలకొండ/గరుగుబిల్లి: రైతు సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం మూడు జిల్లాల రైతులకు సాగునీటి ఆధారమైన తోటపల్లి ప్రాజెక్టుపై కపటప్రేమ చూపుతోందని, కాలువల అభివృద్ధి, షట్టర్ల ఏర్పాటు, ఆధునికీకరణ పనులను నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు. ఖరీఫ్ ఆసన్నమైనా రైతుల సాగునీటి సమస్యను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. తోటపల్లి జలాశయం ఎడమ ప్రధాన కాలువ రెగ్యులేటర్ను రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మా ట్లాడారు. తోటపల్లి ఆధునికీకరణ పనుల పూర్తిపై పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి దృష్టిసారించకపోవడం తగదన్నారు. 25 శాతం పనులు పూర్తికాలేదని ప్రాధాన్యత క్రమంలో ఉన్న తోటపల్లి ప్రాజెక్టును తప్పించి, ఆధునికీకరణ పనులను రద్దుచేయడం పద్ధతి కాదన్నారు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు కేవలం 9 శాతం మాత్రమే జరగగా అప్పటి టీడీపీ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా బిల్లులు చెల్లించలేదన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 వరకు 14 శాతం పనులు పూర్తి చేశామన్నారు. రెండు విడతల్లో రూ.23,59,28,652లను బిల్లుల రూపంలో చెల్లించిందన్నారు.
ఖరీఫ్కు సాగునీరిస్తారా....
తోటపల్లి జలాశయం వద్ద ఉన్న ఎడమకాలువ రెగ్యులేటర్ తలుపులు మరమ్మతులకు గురికావడంతో ఎడమకాలువ ద్వారా నీరు వృథాగా పోతోందన్నారు. రైతులకు ప్రస్తుతం నీరు అవసరం లేకపోయినప్పటికీ తోటపల్లి నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు ఖరీఫ్ పనులు సజావుగా చేపట్టలేకపోతున్నారన్నారు. ఖరీఫ్లో నీటి అవసరం ఉన్నప్పుడు సాగునీరు అందుతుందా లేదా అనే ఆందోళనలో రైతాంగం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం తోటపల్లి ఆయకట్టు రైతులకు శాపంగా మారిందన్నారు. గత ఎన్నికల ముందు తోటపల్లి అంశాన్ని పదే పదే రైతుల వద్ద ప్రస్తావించి కల్లబొల్లి మాటలతో రైతుల ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆధునికీకరణ పనులను రద్దుచేసి రైతుల నోట్లో మట్టికొట్టిందన్నారు. ఖరీఫ్కు సాగునీరు విడుదల ప్రణాళికను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, వైఎస్సార్సీపీ వీరఘట్టం,పాలకొండ మండలాల కన్వీనర్లు దమలపాటి వెంకటరమణనాయుడు, కనపాక సూర్యప్రకాశరావు, నాయకులు కర్రి లీలాప్రసాదరావు, పిన్నింటి శ్రీను, కళింగ ప్రేమభూషణరావు, శంభాన శ్రీను, ఇ.లిల్లీపుష్పనాథం, రణస్థలం రాంబాబు, దుప్పాడ పాపినాయుడు, పాలవలస ధవళేశ్వరరావు, పొట్నూరు లక్ష్మణరావు, కోరాడ సూర్యనారాయణబాబు, మాచర్ల వెంకటరమణ, డోకల శ్రీను, నల్లబిల్లి విశ్వేశ్వరరావు, బంకి లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కలియుగ భస్మాసురుడు నారా లోకేశ్
రాష్ట్రంలో రెడ్బుక్ పాలనతో మంత్రి నారా లోకేశ్ కళియుగ భస్మాసురుడిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, చివరకు కూటమి ప్రభుత్వానికి అదే రెడ్బుక్ భస్మాసుర హస్తంగా మారుతుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్,మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. ఇటీవల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించినప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు. జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు.