
యోగాంధ్రకు రైట్ రైట్!
● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
● విశాఖ కార్యక్రమానికి బస్సుల్లో తరలింపు
● జిల్లాలోనూ పెద్ద ఎత్తున యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు
సాక్షి, పార్వతీపురం మన్యం: అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇందులో పెద్ద ఎత్తున ప్రజలను, విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. ప్రధానంగా విశాఖ జిల్లాలో శనివారం నిర్వహించబోయే యోగాంధ్ర కార్యాక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. దాదాపుగా ఐదు లక్షల మందితో అక్కడ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు విద్యార్థులను, యోగా సాధకులను పెద్ద ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం డిపో నుంచి స్థానిక అవసరాలతో పాటు, ఇతర జిల్లాలకూ బస్సులను పంపారు. ఆర్టీసీ, హయ్యర్ బస్సులు కలిపి మొత్తం 56 సర్వీసుల వరకూ వెళ్తున్నాయి. సాలూరు, పాలకొండ డిపోల నుంచీ బస్సులు విశాఖకు శుక్రవారమే తరలివెళ్లాయి. ఇవి కాక.. ప్రైవేట్స్కూల్ బస్సులనూ వినియోగిస్తున్నారు. మొత్తంగా మన్యం జిల్లా నుంచి 175 బస్సుల వరకు వెళ్తున్నాయి.
అదే సమయంలో జిల్లాలోనూ...
విశాఖలో జరగనున్న యోగా స్ఫూర్తితో అదే సమయంలో జిల్లాలోనూ పెద్ద ఎత్తున యోగాసనాలు వేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజులుగా వివిధ ముఖ్య ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం విదితమే. శనివారం ఒక్కరోజే జిల్లాలో సుమారు 5.40 లక్షల మందితో యోగా చేయించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రతి మండల, గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో నమోదైన ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. ఇందుకోసం మొత్తం 3,150 ప్రదేశాలను గుర్తించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధ్రువపత్రాలు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటలకే వేదిక వద్దకు అందరూ చేరుకునేలా మండల ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
యోగా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
పార్వతీపురం టౌన్: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించనున్న యోగా ఏర్పాట్లను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. రైల్వేస్టేషన్ ప్రక్కన పార్క్, జగన్నాథపురం వీధిలోని స్కూల్, దేవాంగుల వారి వీధి, చర్చి వీధిలో మున్సిపల్ పార్క్ తదితర ప్రదేశాలను శుక్రవారం సందర్శించి యోగా ఏర్పాట్లపై ఆరా తీశారు. యోగా నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

యోగాంధ్రకు రైట్ రైట్!