రెవెన్యూ ప్రతిష్టను పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ప్రతిష్టను పెంపొందించాలి

Jun 21 2025 3:41 AM | Updated on Jun 21 2025 3:41 AM

రెవెన్యూ ప్రతిష్టను పెంపొందించాలి

రెవెన్యూ ప్రతిష్టను పెంపొందించాలి

పార్వతీపురంటౌన్‌: జిల్లా ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవలతో ఆ శాఖ ప్రతిష్ట మరింత పెంపొందాలని, ఆ దిశగా రెవెన్యూ శాఖాధికారులు, ఉద్యోగులు కృషిచేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్‌ వరకు అందరూ నిబద్ధతతో పనిచేసి ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ చాలా కీలకమైనదని, ఒక్కోసారి 24/7 విధులు నిర్వర్తించవలసి ఉంటుందన్నారు. ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, భూసేకరణ, వివిధ రకాల పత్రాల జారీ, ప్రభుత్వ పథకాల అమలు వంటివి ప్రజలకు అందించాల్సిన అన్ని సేవలు రెవెన్యూ శాఖతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వర్తించవలసి ఉంటుందని, తమ క్షేమాన్ని ఆశించకుండా ప్రజల కోసం నిస్వార్థం్గా నిబద్ధతతో పనిచేసే శాఖ రెవెన్యూ మాత్రమేనని కొనియాడారు.

పనిచేయడంలో ప్రణాళిక ఉండాలి..

రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పనిచేయడంలో ప్రణాళిక ఉండాలని, బాధ్యతగా చేస్తే మరింత మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్‌ హితవు పలికారు. రాబోయే రోజుల్లో ప్రతి పని డిజిటలైజేషన్‌ అవుతుందని, కావున ప్రతి ఉద్యోగి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా సేవలు అందించడం వల్ల పారదర్శకత ఉంటుందని, అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వివరాలను తెలుసుకునే సౌలభ్యం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. కె.చుక్కా అలియాస్‌ కోనేరు అప్పారావుకు బాండెడ్‌ లేటర్‌ చట్టం ప్రకారం చెక్కును అందజేశారు.

కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌

ప్రజలతో మమేకం కావాలి..

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత మాట్లాడుతూ కుటుంబ శ్రేయస్సును వదిలి, విధి నిర్వహణలో పూర్తిగా నిమగ్నమైన ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులని కొనియాడారు. అన్నిసేవలు అందిస్తున్న రెవెన్యూ శాఖను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందించే సేవల ద్వారా వారి మన్ననలను పొందాలని హితవు పలికారు. ఉత్తమ సేవలు అందించడం ద్వారా రెవెన్యూ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, ఆ దిశగా అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కోరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉపాధ్యకుడు శ్రీరామమూర్తి, జిల్లా గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు సింహాచలం నాయుడు, కలెక్టర్‌ కార్యాలయం పరిపాలన అధికారి సీహెచ్‌, రాధా కృష్ణమూర్తి తదితరులు రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలను గుర్తుచేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో వేగవంతంగా మరిన్ని సేవలు అందించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు, ఉపతహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement