
నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలవండి
భోగాపురం: కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారికి అండగా నిలబడాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడులు సూచించారు. ఈ మేరకు భోగాపురానికి చెందిన సుందర హరీష్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియ మితులైన సందర్భంగా శుక్రవారం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడులను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యార్ధులు, యువతకు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏడాది అవుతున్నా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయలేదని విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలో విద్యార్థుల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో నాయకులు గోపి, బంగార్రాజు, వెంకన్న, ప్రసాద్, శ్రీను, సాయిరాం, భాస్కరరావు, మాధవ, అప్పారావు, గురువులు, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా నిలవండి