
కాలేజీలో సీట్లు హౌస్ఫుల్..!
● ప్రభుత్వ బాలికల జూనియర్
కళాశాలకు పోటెత్తిన అడ్మిషన్లు
● అధ్యాపకుల కృషిఫలితంగా కోలుకున్న కళాశాల
రాజాం: నిన్నమొన్నటి వరకూ పదుల సంఖ్యలో మాత్రమే ఆ కళాశాలలో విద్యార్థినులు ఉండేవారు. ఒకగానొక దశలో ఆ కళాశాల ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అధ్యాపకులు నిరంతర శ్రమతో అక్కడ చదువుతున్న విద్యార్థుల అభ్యసనకు పదునుపెట్టారు. మంచి ఫలితాలు సాధించారు. ఫలితంగా ఒక్కసారిగా ఆ కళాశాలలో అడ్మిషన్లు సంఖ్య పెరగడం ప్రారంభించింది.
కనీవినీ ఎరగని రీతిలో అడ్మిషన్స్
రాజాం పట్టణంలోని సారథిరోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. జిల్లాలో అత్యధికంగా ఇంటర్ అడ్మిషన్లు పూర్తిచేసుకున్న ఘనత ఈ కళాశాల ఇప్పుడు దక్కించుకుంది. ఈ ఏడాది వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ఇక్కడ 92 శాతం ఉత్తీర్ణత లభించడంతో పాటు విద్యార్థినులు అధికమార్కులు సాధించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఇక్కడ ఇంటర్ చేరికలు 163కు పెరిగాయి. కళాశాలలోని ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు సంబంధించి ఇంగ్లీషు, తెలుగు మీడియంలో బోధనచేస్తున్నారు. మొత్తం 11 మంది అధ్యాపకులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ చేరికలు కావడంతో అడ్మిషన్లు నిలుపుదల చేశారు.
ప్రిన్సిపాల్ నిర్ణయాలతో..
ఏడాదిన్నర క్రితం ఇక్కడికి జనార్దనరావు ప్రిన్సిపాల్గా వచ్చారు. అంతకుముందు ఆయన సంతకవిటి మండలంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా చేసేవారు. అక్కడ కూడా ఆయన అనుసరించిన విఽధానాలు, క్రమశిక్షణ, సమయపాలన, కళాశాల అభివృద్ధి తదితర అంశాల్లో తన పాత్ర చాటుకున్నారు. అక్కడి నుంచి రాజాం ప్రభుత్వ బాలికల కళాశాలకు బదిలీపై వచ్చిన ఆయన ఇక్కడ కూడా విద్యార్థినుల్లో క్రమశిక్షణ అలవాటుచేయడం, నిరంతర శ్రమ, సమయపాలన, విద్యార్థినుల తల్లిదండ్రలుతో సమావేశాలు, పదోతరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడంతో ఇక్కడి కళాశాలపై అందరి దృష్టిపడింది. వీటికి తోడు అందరు అధ్యాపకులు పోటాపోటీగా బోధన చేయడంతో విద్యార్థినులు రాణించి, మంచి ఫలితాలు సాధించడం, ఫలితంగా ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి.

కాలేజీలో సీట్లు హౌస్ఫుల్..!