
రాజన్నదొరపై తప్పుడు మాటలు మాట్లాడితే ఖబడ్దార్
సాలూరు: మక్కువ మండల టీడీపీ అధ్యక్షుడు, మంత్రి సంధ్యారాణి సన్నిహిత అనుచరుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, స్థాయిని మరిచి విమర్శలు చేస్తే సహించేది లేదంటూ గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సాలూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఎంపీపీలు ప్రమీల, రాములమ్మ, సర్పంచ్లు ఆదయ్య, సుదర్శనరావు, ఎంపీటీసీ సుబ్బారావు, సీతారాం, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నాయకులు పరిమళ, ఉదయ్కుమార్, కల్యాణ్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏఎంసీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి సమక్షంలో టీడీపీ మండలాధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను ఉద్దేశించి దగాకోరు అంటూ చేసిన తీవ్ర అభ్యంతరకర పదజాలాన్ని వాడారంటూ అందరూ ముక్త కంఠంతో మండిపడ్డారు. ఓ గిరిజన రైతు కుటుంబం నుంచి నిబద్ధతగల రాజకీయనాయకుడిగా ఉపముఖ్యమంత్రి, మంత్రి స్థాయికి ఎదిగి ఎందరో గిరిజనులకు ఆదర్శంగా రాజన్నదొర నిలిచారన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సాలూరుకు సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు విరివిగా చేయించి, సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో తన పాలనలో చూపించారన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఏనాడూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా పార్టీల విధి విధానాలపై రాజకీయ విమర్శలు మాత్రమే చేశారని గుర్తుచేశారు. అటువంటి రాజన్నదొరపై గుల్ల వేణు దగాకోరంటూ మాట్లాడడం దానిని అక్కడే ఉన్న మంత్రి సంధ్యారాణి వారించకపోవడాన్ని గిరిజనసమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ఆధారాలు చూపించాలి
రాజన్నదొరను దగాకోరు అని వేణుగోపాల్ ఏ ఆధారాలతో మాట్లాడాడో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఆధారాలు చూపించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి సంధ్యారాణి సమక్షంలో విలేకరిని చంపుతానని హెచ్చరించిన వేణు, మంత్రి అండదండలతో రెచ్చిపోతున్నాడని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు భరత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మక్కువ టీడీపీ మండలాధ్యక్షుడిపై
నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ