
కూటమి కక్షపూరిత చర్యలు
బొబ్బిలి: ఇటీవలే కౌన్సిలర్లకు తాయిలాలతో వల వేసి అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు వైస్చైర్మన్ పదవికి కూడా అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అడ్డడారులు వెతుక్కునే టీడీపీ నాయకులకు అధికార దాహం చల్లారడం లేదు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సందర్శకులు, కౌన్సిలర్ల కోసం కుర్చీలు, ఓ టేబుల్ ఉండేవి. అక్కడ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కూర్చుంటున్నారని సంవత్సరాల తరబడి ఉన్న ఫర్నిచర్ను గురువారం తొలగించారు. అధికారులు, కౌన్సిలర్ల కోసం, సందర్శకులు, అర్జీదారులు కూడా వచ్చి కాసేపు కూర్చుని తమ పనులు చక్కబెట్టుకుని వెళ్లేవారు. నిన్నమొన్నటి వరకూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే అధిక సంఖ్యలో ఉండడం వల్ల అక్కడ వారు కూడా కూర్చునే వారు. ఆయా వార్డులకు చెందిన ప్రజలు వస్తే వారి యోగక్షేమాలు కనుక్కుని అధికారుల వద్ద ఏమైనా పనులుంటే చేసిపెట్టేవారు. అవిశ్వాసంతో ఈ మధ్యనే అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అక్కడున్న విజిటర్స్ చాంబర్ను పూర్తిగా తొలగించారు. ఒక్క కూర్చీ కూడా లేకుండా చేశారు. గురువారం యాథాలాపంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అక్కడ కూర్చునేందుకు ఒక్క కుర్చీ కూడా లేకపోవడంతో అవాక్కయ్యారు. ఇదేం ఘోరం అంటూ కమిషనర్ రామలక్ష్మిని కలిసి అడ్గగా ఆమె నీళ్లు నమిలారు. ఏం చేస్తాం చెప్పండి నాకు కొద్ది రోజులుగా వాటిని తొలగించాలని బాగా ప్రెజర్ ఉందని కౌన్సిలర్లతో చెప్పారు. దీంతో కౌన్సిలర్లు నేరుగా వచ్చి కిందనే కూర్చున్నారు. కూటమి నాయకుల ఆదేశాలతో ఇలా కుర్చీలు తొలగించడం దారుణమని, ఇదేం చోద్యమని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కూటమి నాయకుల తీరు పట్ల ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
సందర్శకులు, కౌన్సిలర్ల కుర్చీలు
తొలగించి రాక్షసానందం