
1998నా.. 2008కా!
● బదిలీల్లో ప్రాధాన్యం ఎవరికి? ● తమ వృద్ధాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటున్న ఎంటీఎస్లు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఉపాధ్యాయుల బదిలీ లు ముగిశాయి. ఇక మినిమం టైం స్కేల్(ఎంటీ ఎస్) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్య డైరెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నా రు. 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోస్టింగులిచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 480 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1998 బ్యాచ్కు చెందిన వారిలో విధుల్లో చేరిన కొద్దిరోజులకే కొంతమంది ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పుడు పని చేస్తున్న వారిలో కొందరు ఒకట్రెండు సంవత్సరాల్లో రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జరగనున్న బదిలీల్లో తమను దూర ప్రాంతాలకు పంపిస్తే ఎలా చేయగలమని వారంతా వాపోతున్నా రు. ప్రభుత్వం కూడా బదిలీల్లో 2008 డీఎస్సీ వారికి తొలి ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. అదే జరిగితే తాము అన్యాయమైపోతామని 1998 ఎంటీఎస్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ప్రకటించారు. మిగిలి ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకుని మానవతాదృక్పథంతో స్థాన చలనానికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.