
సచివాలయ సిబ్బంది మెడపై కత్తి
రామభద్రపురం: ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను స్థానికంగా అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ఐదేళ్లపాటు విజయవంతంగా నడిపించింది. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసింది. అయితే ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేందకు కంకణం కట్టుకుంది.అందులో భాగంగా ఇప్పటికే వలంటీర్లను తొలగించిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై విషం చిమ్ముతోందని, అలాగే అనేక సర్వేలతో పని ఒత్తిడి పెంచి వారిని వేధిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఒకే గ్రామ,వార్డు సచివాలయంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీచేయాలని, వారి సొంత మండలానికి బదిలీచేయకూడదని, ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులను కూడా రిక్వెస్ట్ మేరకు మాత్రమే బదిలీ చేయొచ్చని స్పష్టం చేస్తూ తాజాగా బదిలీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీచేసినట్లు అధికారిక సమాచారం.
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల ఆవేదన
జిల్లాలో 626 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా వాటిలో సుమారు 5,588 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ హేతుబద్ధీకరణ పేరిట ఐదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగున్నా..వారి సొంత మండలాల్లో బదిలీ పోస్టింగ్ ఇవ్వకూడదని, ఇతర మండలాలకు బదిలీ చేయాలనే నింబధనతో ఆయా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు వస్తున్న రూ.30 వేల అరకొర జీతాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడతామని, ఇతర మండలాల్లో ఇంటి అద్దెలు, పిల్లల చదువులతో పాటు కుటుంబ పోషణకు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల్లో కోరుకున్న వారిని మినహాయించి మిగిలిన వారినందరికీ సొంత మండలాల్లోనే బదిలీలు కల్పించాలని కోరుతున్నారు. అలాగే రిక్వెస్ట్ దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగులను కూడా ఆ మండలం పరిధిలోనే ఉండేలా బదిలీ చేయాలని కోరుతున్నారు. బదిలీ ప్రక్రియలో సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదనే జీవోను సవరించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. బదిలీ ప్రక్రియను ఆఫ్లైన్ విధానంలో కాకుండా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్లైన్ విధానంలోనైతే భారీగా పైరవీలు సాగే ప్రమాదం ఉందని, దీని వల్ల ఉద్యోగులు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆందోళన చెందుతున్నారు.
అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం కక్ష
ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి స్థానచలనం
ఇతర మండలాలకు బదిలీ
చేయాలనే నిబంధన
ఆర్థికంగా ఇబ్బందులు పడతామని సిబ్బంది ఆవేదన
ప్రభుత్వం నిర్ణయం మేరకే బదిలీలు
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరుగుతుంది.ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరిగా స్థానచలనం ఉంటుంది. అలాగే సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరు. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులకు వారి అభ్యర్థన మేరకు బదిలీ ఉంటుంది.ఆన్లైన్లోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా బదిలీ ప్రక్రియ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
– ఎం.రాజారాణి, సచివాలయ శాఖ
ప్రత్యేకాధికారి విజయనగరం