ప్రతి మహిళ లక్షాధికారి కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళ లక్షాధికారి కావాలి

Jun 18 2025 3:19 AM | Updated on Jun 18 2025 3:19 AM

ప్రతి మహిళ లక్షాధికారి కావాలి

ప్రతి మహిళ లక్షాధికారి కావాలి

పార్వతీపురంటౌన్‌: పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి మహిళా లక్షాధికారి కావాలని, ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామిక వేత్త వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ మెప్మా అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వివిధ రకాల జీవనోపాధుల ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకుని మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో ఏపీఎంలు, సీఓలు, ఆర్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలకు జీవనోపాధి కల్పించి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేలా చేస్తున్న కృషిని కలెక్టర్‌ ముందుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మెప్మా అధ్వర్యంలో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులతో కొత్త వ్యాపార యూనిట్లను స్థాపించి, వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళలు లాభాలు ఆర్జించేలా యూనిట్ల స్థాపన ఉండాలన్నారు. అలాగే యూనిట్ల ఏర్పాటుకు అవసరమైతే శిక్షణను ఇప్పించాలని సూచించారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలను విస్తరించవచ్చని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. సరుకుల కొనుగోలు, విక్రయాల్లో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని, అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో విక్రయించడం ద్వారా, డోర్‌ డెలివరీ వంటి సదుపాయాలను కల్పించడం ద్వారా వ్యాపారాలను మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా మార్టులు, మొబైల్‌ మార్టులు, కాఫీ షాపులు వంటి కొత్త ఆలోచనల ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని వివరించారు. ఇప్పటికే వస్త్ర వ్యాపారాలు, తినుబండారాలు, ఫ్యాన్సీ పాపుల ద్వారా మహిళలు లాభాలను ఆర్జిస్తున్నారని, అయినప్పటికీ వాటికి భిన్నంగా అందరికీ అవసరమయ్యే వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కలెక్టర్‌ స్పష్టం చేశారు.

సూర్యఘర్‌ ఏర్పాటుకు సబ్సిడీ

అనంతరం ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంపై సమీక్షించిన కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సూర్యఘర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సూర్యఘర్‌ యూనిట్‌ ఏర్పాటుతో 28 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్‌ పొందవచ్చని, ఇందుకు అవసరమైన రుణాలను బ్యాంకు మంజూరు చేయడమే కాకుండా దాదాపు 50 శాతం వరకు సబ్సిడీ కూడా ప్రభుత్వం నుంచి లభిస్తుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ముందుగా సొంత ఇల్లు కలిగిన మెప్మా ఉద్యోగులు, సిబ్బంది సూర్యఘర్‌ యూనిట్లను ఏర్పాటుచేసుకుని, మిగిలిన సభ్యులకు అవగాహన కల్పించి, వారు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే మాసానికి ప్రతి ఉద్యోగి కనీసం 100 యూనిట్లు గ్రౌండింగ్‌ చేయించాలని, బ్యాంకుల నుంచి సమస్యలు ఉంటే వాటిని తన దష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో మెప్మా పథక సంచాలకుడు జీవీ చిట్టిరాజు, ఏపీఎంలు, సీఓలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement