
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● బొలెరో వాహనం కిందికి బైక్తో భార్యాభర్తలు
పాలకొండ రూరల్: మండలంలోని పణుకువలస కూడలిలో గల మలుపు వద్ద మంగళవారం రెప్పపాటులో పెనుప్రమాదం నుంచి భార్యాభర్తలు బయటపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీరఘట్టం మండలంలోని మొట్ట గ్రామానికి చెందిన లచ్చుభుక్త దుర్గారావు, భార్య రమ్యతో కలిసి ద్విచక్రవాహనంపై పాలకొండ వచ్చారు. వారి గ్రామంలో అమ్మవారి పండగలు, పాఠశాలలు ప్రారంభం కావడంతో అవసరమైన సరుకులు, పిల్లల కోసం పుస్తకాలు, బ్యాగులు కొనుగోలు చేసుకుని తమ ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. పణుకువలస మలుపు వద్దకు చేరుకునే క్రమంలో వీరఘట్టం నుంచి పాలకొండ వైపు వస్తున్న బొలెరో వాహనం వారి బైక్ను ఢీ కొంది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న భార్యాభర్తలు తమ వాహనంతో సహా ఎదుటి వాహనం కింద ఇరుక్కుపోయారు. బొలెరో కొంత దూరం వెళ్లడంతో ఇద్దరూ మరణించి ఉంటారని స్థానికులు భావించారు. విషయం గమనించిన బొలెరోను డ్రైవర్ నిలుపుదల చేయడంతో రెప్పపాటులో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో భర్త దుర్గారావుకు కాలు నుజ్జవగా, భార్య రమ్య తీవ్ర గాయాలతో బయపడ్డారు. అక్కడి వారు అందించిన సమాచారంతో 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించింది. ప్రాథమిక సేవలు అందించిన వైద్యులు మెరుగైన సేవల కోసం రమ్యను రాజాంకు, దుర్గారావును విశాఖపట్నం ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రమాద సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి.

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం