
రెండు బస్సులు ఢీకొని ఐదుగురికి గాయాలు
డెంకాడ: మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనగా ఐదుగురు గాయపడినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. విజయనరం–నాతవలస ఆర్అండ్బీ రహదారిపై డెంకాడలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డెంకాడ నుంచి విజయనగరం వైపు వస్తుండగా, విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డెంకాడ గ్రామంలో ఎదురెదురుగా ఢీకొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. ఈ ప్రమాదం సందర్భంగా ప్రైవేట్ పాఠశాల బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని స్థానికులు తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ
ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోనం నాగ మాధవి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో పాటు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి ఓదార్చారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.