
పవర్ లేని ఎంఈవోలు!
ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సీనియర్ హెచ్ఎంలకే ఎంఈవోలుగా అవకాశం లభిస్తుంది. వీరూ మండల అధికారి స్థాయివారే. పాఠశాలల పరిశీలన, తనిఖీ, విద్యాభివృద్ధి కార్యక్రమాలపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల నిర్వహణ, విద్యార్థుల సృజనకు పదును పెట్టేలా విద్యాకార్యక్రమాలు అమలు చేయడం, అభ్యసనా సామర్థ్యాల పర్యవేక్షణ, విద్యాప్రమాణాలు పెంపొందించడం, మండలంలోని పాఠశాలల అనుమతులపై ఆరా తీయడం, బోధనకు వీలుగా ఉపాధ్యాయుల సర్దుబాటు, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల వృత్తిపరమైన సమస్యలను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఎంఈవో–1 ప్రధాన విధులు. మండలానికి ఒకరు చొప్పున వీరు విధులు నిర్వర్తిస్తారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రస్తుతం గరుగుబిల్లి, జియ్యమ్మవలస మినహా మిగిలిన అన్నిచోట్లా వీరు పని చేస్తున్నారు. వాస్తవానికి ఎంఈవోలకు సంబంధించి పై అజమాయిషీ అంతా డీఈవో పరిధిలోనే ఉంటుంది. వీరికి సర్వీసు రిజిస్టర్, సెలవు, ఇంక్రిమెంట్.. ఇలా అధికారికంగా ఏ పనినైనా డీఈవో అనుమతితోనే చేయాలి. ఒక్క జీతం విషయంలో మాత్రం డ్రాయింగ్ పవర్ను ఎంపీడీవోలకు ఇచ్చారు. ఈ విధానాన్ని చాలా రోజుల నుంచి ఎంఈవోలు వ్యతిరేకిస్తున్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రభుత్వ బడులను బాగు చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పాఠశాలలపై పర్యవేక్షణ పెంచడానికి మండలానికి ఇద్దరు చొప్పున ఎంఈవోలను నియమించింది. మండల విద్యాశాఖాధికారి–1, 2గా వీరు వ్యవహరించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరలా ప్రభుత్వ విద్యారంగంపై నిర్లక్ష్యం కనబరుస్తోంది. ఎంఈవో–2 వ్యవస్థను సందిగ్ధంలో పడేసింది. మరోవైపు ఎంఈవో–1ల చిరకాల డిమాండ్ను కూడా పట్టించుకోవడం లేదు. తమకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ ఇవ్వాలని మండల విద్యాశాఖాధికారులు ఎప్పటి నుంచో కోరుతున్నా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు.
ఆత్మగౌరవాన్ని మరోచోట నిలబెట్టాలా?
విద్యాశాఖపరంగా ఎంఈవో.. ఆ మండలానికి బాస్. ఒక మండలంలో పరిధిని బట్టి 50 నుంచి 150 వరకు పాఠశాలలు వీరి పర్యవేక్షణలో ఉంటాయి. పది మంది సిబ్బంది ఉన్న హైస్కూల్ హెచ్ఎంలకు సైతం సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ ఉంది. అటువంటిది ఒక మండలంలోని పాఠశాలలను లీడ్ చేసే ఎంఈవోలు జీతాల కోసం ఎంపీడీవోల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. డ్రాయింగ్ పవర్ ఎంపీడీవోల చేతిలో పెట్టడం వల్ల ప్రతినెలా వారి వద్దకు వెళ్లి చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వస్తోందని.. ఇదే అదునుగా చూపి వారు సంబంధం లేని పనులన్నీ తమతో చేయిస్తున్నారని ఓ మండల విద్యాశాఖాధికారి వాపోయారు. ర్యాలీలు, పంచాయతీరాజ్కు సంబంధించిన విధులు, సర్వే వంటి అదనపు పనులు అప్పగిస్తున్నారని.. దీనివల్ల చాలా సందర్భాల్లో విద్యాశాఖకు సంబంధించిన విధులు చేయలేకపోతున్నామని మరో ఎంఈవో తెలిపారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని వారి వద్ద చేతులు కట్టుకొని నిల్చోవాల్సి వస్తోందని వాపోయారు. ఇదే విషయమై అనేక మార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా విన్నవించామని చెబుతున్నారు. ఇతర డిమాండ్లేవీ తాము కోరడం లేదని అంటున్నారు.
న్యూస్రీల్
పని ఓ చోట..
డ్రాయింగ్ పవర్
మరో చోట
ఎంపీడీవోల వద్దే డ్రాయింగ్ పవర్
‘సెల్ఫ్’ ఇవ్వాలని కోరుతున్న మండల విద్యా శాఖాధికారులు