
త్వరలో జిల్లాకు అదనపు జాగిలాలు
● నూతన కెన్నల్స్ నిర్మాణానికి చర్యలు ● పాత వాటిని పరిశీలించిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: నేరాలు జరిగినప్పుడు నిందితులను కనిపెట్టేందుకు సిబ్బందితో పాటు నేరం జరిగిన ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తులో ముఖ్యభూమిక పోషిస్తున్న జాగిలాలకు సరైన శాశ్వత విశ్రాంతి గదుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. ఈ మేరకు ఏఆర్ క్వార్టర్స్లో ఉన్న పాతభవనాలను ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం ఏఆర్ సిబ్బందితో కలిసి పరిశీలిచారు. పాతబడిన గదులను, జాగిలాలు ఉంటున్న స్థలాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో పాటు నేరం జరిగే ప్రదేశానికి వెళ్తున్న జాగిలాలకు శాశ్వతమైన గదులు లేవని, నేరాలను కనిపెట్టడంలో, కేసు ఛేదనలో సిబ్బంది కంటే ముందే గుర్తులు ఇవ్వడంలో కీలక పాత్రను జాగిలాలు పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న జాగిలాలకు అదనంగా మరికొన్ని నార్కొటెక్స్, స్నిప్పర్, ట్రాకింగ్ జాగిలాల అవసరం జిల్లా పోలీస్ శాఖకు ఉందన్నారు. ప్రతిపాదనల మేరకు అదనపు జాగిలాలు జిల్లాకు రానున్నట్లు తెలిఆపరు. ప్రస్తుతం ఏఆర్క్వార్టర్స్లో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఆర్ సిబ్బందిని ఆదేశించారు. పరిశీలనలో ఎస్పీ వెంట ఎస్బీ సీఐ లీలారావు, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, జాగిలాల హ్యండ్లర్స్ పాల్గొన్నారు.