
బాలికను కాపాడిన కానిస్టేబుల్
● ప్రశంసాపత్రం అందజేసిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: నగరంలో ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన ఓ బాలికను టూటౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ కాపాడినందుకు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తన చాంబర్లో ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. డయల్ 112కు వచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్ నగర్లోని ఓ ఆపార్టెమెంట్లో 17 ఏళ్ల బాలిక తలుపులేసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న సమాచారాన్ని కానిస్టేబుల్ జగదీష్ అందుకున్నారు.సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో ఆ అడ్రస్కు వెళ్లి సదరు బాలికను ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. విచారణలో బాలిక చదువును నిర్లక్ష్యం చేయడం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నందున తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది. ఎస్పీ ఆదేశాలతో టూటౌన్ సీఐ శ్రీనివాస్ బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
పాచిపెంటలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన
పాచిపెంట: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు పాచిపెంట మండలంలో బుధవారం పర్యటించారు. మండలంలోని పెద్దగెడ్డ నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని కొటికిపెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. అలాగే పెద్దగెడ్డ జలాశయం గిరిజన మత్స్యకారులకు లైఫ్ జాకెట్స్, వలలు, పడవలు ప్రభుత్వం నుంచి ఉచితంగా అందజేయాలని కోరారు. కుడుమూరు రెవెన్యూ సర్వేనంబర్ 48లో గిరిజనులు సాగుచేస్తున్న సుమారు ఎనిమిది వందల ఎకరాల భూమికి సంబంధించి గిరిజన రైతులకు పట్టాలు అందించాలని, గిరిజన రైతు సూకురు అప్పలస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంట స్థానిక తహసీల్దార్ డి.రవి, ఆర్ఐ రమణ ఉన్నారు.
మహిళపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
జియ్యమ్మవలస: మహిళను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడిన చినమేరంగి గ్రామానికి చెందిన సిరిపురపు నానిని చినమేరంగి ఎస్సై పి.అనీష్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వివాహితను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన సిరిపురపు నానిపై బాధితురాలు, ఆమె భర్త ఇటీవల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి కోర్డుముందు హాజరు పర్చామని తెలిపారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని సీఐ చెప్పారు. మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, లైంగికదాడులకు పాల్ప డితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోక్సో కేసులో ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష
జియ్యమ్మవలస: మండలంలోని కన్నపుదొరవలస గ్రామానికి చెందిన సామల నవీన్ అనే వ్యక్తికి పోక్సోకేసులో పదేళ్ల జైలు శిక్ష పడిందని ఎస్సై అనీష్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముద్దాయి సామల నవీన్(26)పై 25.3.2021లో చినమేరంగి పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి కోర్టు విజయనగరం వాదోపవాదనల తరువాత నేరారోపణ రుజువు కావడంతో పదేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నాగమణి బుధవారం తీర్పు వెల్లడించారు. ముద్దాయికి శిక్ష పడేవిధంగా దర్యాప్తు నిర్వహించిన సీఐ తిరుపతిరావు, ఎస్సై బి.శివప్రసాద్, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన ఎస్సై అనీష్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ మాధవరెడ్డి అభినందించారు.

బాలికను కాపాడిన కానిస్టేబుల్

బాలికను కాపాడిన కానిస్టేబుల్