
పహల్గాం దాడి పిరికిపంద చర్య
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
● సజావుగా స్థాయీ సంఘ సమావేశాలు
విజయనగరం రూరల్: జమ్ముకశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని, ఈ దాడిని భారతీ యులంతా ఖండిస్తున్నారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కాల్పులకు ప్రతిచర్యగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రధాని మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన బుధవారం స్థాయీసంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని సన్నద్ధంగా ఉండాలన్నారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. విత్తనాలు తప్పుదారిన దళారుల చేతికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు సక్రమంగా పనిచేయాలని సూచించారు. కేజీబీవీ విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఆయన మాట్లాడుతూ ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా పరిషత్ నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పరీక్ష తప్పిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వ్యక్తిగతంగా వాళ్లకు సహాయం అందించాలని సూచించారు. అనంతరం పహల్గాం దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. ఈ ఘటనను ఖండిస్తూ జిల్లా పరిషత్లో తీర్మానం చేశారు.