జిల్లా విద్యాశాఖాధికారి రామారావు
నరసరావుపేట రూరల్: బడి కోసం కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంపై 28 మండలాల సిబ్బంది, సీఆర్పీలకు శిక్షణ, సమీక్ష సమావేశం సోమవారం కేసానుపల్లిలోని ఎంఏఎం కళాశాలలో నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజలు, పూర్వ విద్యార్థులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తల సహకారాన్ని సమీకరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇందుకోసం డోనర్ పోర్టల్ లక్ష్యాలు, దాతల భాగస్వామ్యం, నమోదు ప్రక్రియను వివరించారు. దాతలు నగదు, వస్తు రూపంలో అందించే సహాయాన్ని నమోదు చేయాలని తెలిపారు. తద్వారా దాతల సహకారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని వివరించారు. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్టినేటర్ పి.శ్యాంప్రసాద్, సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ అధికారులు శ్రీనివాసరెడ్డి, నాయక్, సెక్టోరల్ అధికారులు పద్మారావు, పూర్ణచంద్రరావు, సెల్వరాజ్, శంకర్రాజు పాల్గొన్నారు.


