ఏమాత్రం పట్టించుకోరే? | - | Sakshi
Sakshi News home page

ఏమాత్రం పట్టించుకోరే?

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

ఏమాత్రం పట్టించుకోరే? నరసరావుపేట టౌన్‌: ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యుని ఓపీ దగ్గర నుంచి టెస్టులు, మందుల ఖర్చులు భరించ లేక పేదలు ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయిస్తారు. అయితే ప్రభుత్వ వైద్యశాలలోనూ వైద్యం సక్రమంగా అందక, మందులు అందుబాటులో లేక రోగుల పేదరికాన్ని వెక్కిరిస్తున్నాయి. చిన్న చిన్న రోగాలకు సైతం మందులు లేవంటూ చీటీని చేతిలో పెడుతుంటే ఇదెక్కడి దౌర్భాగ్యమంటూ పేదలు ఆవేదన చెందుతున్నారు. కొందరు వృద్ధులు, రోగులు క్రమతప్పకుండా తప్పకుండా బీపీ, షుగర్‌ మందులు వినియోగించాలి. అధిక శాతం మంది నిరుపేదలు తమ జీవితాన్ని గడిపేందుకు పింఛన్‌ మీద మాత్రమే ఆధారపడి ఉంటారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు కూడా లేకపోవడంతో పింఛన్‌ డబ్బులతోనే మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది తమ జీవనాధారంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చిన్నపిల్లలకు, ఇన్‌ఫెక్షన్‌ నివారణకు వాడే సిరప్‌లు, మాత్రలకు సైతం అవస్థలు పడుతున్నారు. పల్నాడు జిల్లాకు పెద్ద ఆసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలకు జిల్లా నలుమూలల నుంచేకాక బాపట్ల, ప్రకాశం జిల్లాల నుంచి ప్రతి రోజు వందలాది మంది వైద్యసేవల కోసం వస్తుంటారు. మందుల కొరతపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రులకు ఔషధాలను సరఫరా చేసే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోనే అత్యవసర మందుల కొరత ఉంది. ఔషధాల కొరతను అధిగమించేందుకు అధికారులు కొన్ని రకాల మందుల కోసం ఇండెంట్‌ పంపారు. రాష్ట్ర స్థాయి నుంచి ప్రధాన డ్రగ్‌ స్టోర్‌కు వచ్చే మందుల సరఫరాలో అనేక అడ్డంకులు ఉన్నాయి. ప్రధానంగా డ్రగ్స్‌కు సంబంధించి ఆయా మందుల కంపెనీలకు ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. డ్రగ్స్‌ అధికారులు పర్చేజింగ్‌ ఆర్డర్లు ఇస్తున్నా మందులు రావడం లేదని తెలుస్తోంది. సీజన్‌ మారుతున్నప్పుడల్లా వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ క్రమంలో ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. వ్యాధులు ముప్పు పొంచి ఉండే సమయంలో ప్రభుత్వం మందులపై నిర్లక్ష్యం వహించడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు.

పల్నాడు జిల్లాలో ఒక డీఎంఈ ఆస్పత్రి, రెండు ప్రాంతీయ, ఎనిమిది ఏపీవీవీపీ, 42 పీహెచ్‌సీలు, 26 యూహెచ్‌సీలు ఉండగా వీటన్నింటికీ గుంటూరు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచే ఔషధాలు సరఫరా అవుతున్నాయి. మొత్తం 712 రకాలకుగాను అరకొరగా మాత్రమే వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రోగులకు అధికంగా ఉపయోగపడే యాంటీ బయాటిక్స్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన మొదటి త్రైమాసికం కింద సుమారు రూ.90 లక్షల విలువైన మందులు సరఫరా అవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు మందులు రాలేదు. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వాటర్‌కు సంబంధించిన మందులు, హెచ్‌డీఎస్‌ నిధులతో కొనుగోలు చేసిన డ్రగ్స్‌తో రోగులకు అరకొరగా అందజేసి చేతులు దులుపుకొంటున్నారు. వైద్యశాల మందుల దుకాణంలో ఔషధాలు లేకపోవడంతో జనరిక్‌, ప్రైవేట్‌ మెడికల్‌ దుకాణాలకు రోగులు పరుగులు తీయాల్సి వస్తోంది.

ప్రభుత్వ వైద్యశాలల్లో నిండుకున్న ఔషధ నిల్వలు

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల బెడద విపరీతంగా ఉంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కకాటుకు ప్రజలు గురవుతూనే ఉన్నారు. ఇవి కరిస్తే వాడే యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్ల సరఫరా ప్రభుత్వ దవాఖానాల్లో దయనీయంగా మారింది. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో సరిపడా నిల్వలు లేకపోవడంతో జిల్లాలోని వైద్యశాలలకు కావాల్సినన్ని వ్యాక్సిన్లు సరఫరా కాలేదు. దీంతో కుక్కకాటు బాధితులు వైద్యశాలకు వచ్చి వ్యాక్సిన్‌ లేక ప్రైవేట్‌ వైద్యశాల వైపు మళ్లి ఆర్థిక భారాన్ని మోస్తున్నారు.

బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేత

బయట కొనుగోలు చేయాలంటున్న వైద్యులు

ఆర్థిక భారం మోయలేక రోగులకు అవస్థలు

మచ్చుకై నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

బిల్లులు చెల్లించకపోవడం వల్లే

తీవ్రమైన టైఫాయిడ్‌ జ్వరంతో దర్శి ప్రాంతం నుంచి గత వారం ఓ వ్యక్తి నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి వచ్చాడు. రోగంతోనే కుటుంబ సభ్యుల సాయంతో ఓపీ లైన్లో పడిగాపులు కాశాడు. చివరికి ఓపీ చీటీ తీసుకుని డాక్టర్‌ వద్దకు వెళితే ఏవేవో పరీక్షలు చేయించమన్నారు. పరీక్షల హాలులోకి వెళ్లగా అక్కడా క్యూ లైన్‌ వెక్కిరించింది. ఎట్టకేలకు పరీక్షలు చేయించుకున్నాడు. సిబ్బంది చెప్పడంతో రోగంతోనే ఇంటిముఖం పట్టాడు. రెండో రోజు వచ్చి రిపోర్టులు తీసుకుని వైద్యుని వద్ద వెళితే మందులు చీటీ చేతిలో పెట్టాడు. ఆ చీటీ తీసుకుని మందులిచ్చే గది వద్దకు వెళితే.. ఇక్కడ లేవు.. బయట తెచ్చుకో అంటూ చీటీ ఇచ్చేశారు... ఇదీ నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నెలకొన్న దుస్థితి.

Advertisement
 
Advertisement
Advertisement