జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ
నరసరావుపేట: అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతతో అలసత్వం లేకుండా గడువులోపు పరిష్కారం చేయాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన వారిచే 119 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ క్లినిక్కు సంబంధించినవి 15 అర్జీలు ఉండగా అందులో నరసరావుపేట డివిజన్ నుంచి ఏడు, గురజాల, సత్తెనపల్లి డివిజన్ల నుంచి నాలుగు చొప్పున ఉన్నాయి. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. డీఆర్ఓ నారదముని, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.


